Mekapati Chandrasekhar Reddy | అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ నాశనం చేశారని ఉదయగిరి ఎమ్మెల్యే, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. జగన్లాంటి వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే ప్రజలు బాగుపడరని అన్నారు. జగన్ను గెలిపించి తప్పు చేశామని వ్యాఖ్యానించారు. ఇక ఆయన జన్మలో ముఖ్యమంత్రి కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి వర్దంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. అయినప్పటికీ తన గ్రాఫ్ బాగోలేదని ఏపీ సీఎం జగన్ కించపరిచారన్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతగానో శ్రమించానని తెలిపారు. కానీ లేనిపోని అనుమానాలు పెట్టుకుని తన టికెట్నే అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.