
(Bogus Darshan Tickets) తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విక్రయిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక్కో నకిలీ టికెట్ను రూ.7 వేల చొప్పున మొత్తం మూడు టిక్కెట్లను విక్రయించినట్లు గుర్తించారు. దళారులతో కుమ్మక్కై ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల లడ్డు కౌంటర్లో పనిచేసే అరుణ్ రాజు, తిరుపతి ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే బాలాజీతో కలిసి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు నకిలీ రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయిస్తున్నారు. కృష్ణారావుకు ప్రత్యేక దర్శనం కౌంటర్ ఉద్యోగి నరేంద్ర సహకరిస్తున్నారు. నరేంద్ర నకిలీ టికెట్లను స్కానింగ్ చేయకుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో నకిలీ టికెట్ల వ్యవహారాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన ఓ భక్త బృందానికి కూడా రూ.3,300 చొప్పున నాలుగు ప్రత్యేక దర్శనం టికెట్లను అమ్మినట్లు ఈ ముఠా పోలీసుల ఎదుట ఒప్పుకున్నది.