హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో మరిమళాలు వెదజల్లే అగర్బత్తీలు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగర్బత్తీల విక్రయాన్ని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. తిరుమల ఏడు కొండలను ప్రతిబింబించేలా ఏడు రకాల అగర్బత్తీలను మార్కెట్లోకి విడుదలచేసినట్టు చైర్మన్ తెలిపారు. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో కలిసి ఆలయాల్లో వినియోగించిన పూలతో దేవుడి చిత్రపటాలు, కీచైన్లు, పేపర్ వెయిట్లు వంటి వస్తువులను తయారుచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు. సప్తగిరి మాసపత్రికను తిరిగి ప్రారంభించామని చెప్పారు.