అమరావతి : విజయవాడలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తిని కొన్ని రోజులకే కాకుండా కడవరకు గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారందరి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను తీర్చేందుకు జనసేన ముందుకు వచ్చిందని తెలిపారు. రాజకీయ పార్టీలకు సైద్ధాంతిక బలం లేనిదే పార్టీ ముందుకు వెళ్లలేదని అన్నారు.
కులం, మతం , ప్రాంతీయతత్వంతో ముందుకు సాగే పార్టీల మనుగడ కొద్దిరోజులకే పరిమిత మవుతుందని పేర్కొన్నారు. నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఏనాడు కులం, మతంతో పనిచేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండల్ మనోహర్, నాయకులు పాల్గొన్నారు. విజయవాడలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఏపీ అసెంబ్లీ ఆవరణలో సీఎస్ సమీర్ శర్మ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.