అమరావతి : తిరుమల లడ్డూ ( Tirumala Laddu ) తయారీలో జంతువుల కొవ్వు ఉందని సిట్ రిపోర్ట్లో స్పష్టంగా ఉందని, ఈ విషయంలో వైసీపీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారని అన్నారు. ఇప్పటికైనా చేసిన పాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. భగవంతుడి వద్ద మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టబోమని, హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామని వెల్లడించారు. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరమని అన్నారు.
దేవుడి విషయాన్ని రాజకీయం చేయకూడదనే నిష్ఠతో వ్యవహరిస్తూ వస్తున్నామని, ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే నిజాలు బయటపెడుతున్నాం. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూను వాడుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. భక్తులందరూ తిరుమలను ఏడు కొండలు అంటారని, వైసీపీ మాత్రం రెండు కొండలు అని ఎందుకు అంటారని అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీ ఐదేండ్ల పాలనలో హిందూ మతంపై అనేక దాడులు జరిగాయని వివరించారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే, ఇవి పోతే ఇంకొకటి కొందామన్నారని గుర్తు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని తెలిపారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివారు చేశారని తప్పుకోనేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తప్పు చేసి క్షమాపణ అడగకుండా మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారని తెలిపారు. వైసీపీ హయాంలో పెద్దఎత్తున దేవాలయాలపై దాడులు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.