కర్నూలు: శ్రీశైల మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతున్నది. వచ్చే నెల 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి యేటా శ్రీశైలంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అలాగే మల్లికార్జున స్వామి, బ్రమరాంబ అమ్మవార్ల కల్యాణం కూడా కన్నుల పండువగా నిర్వహిస్తారు.
మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి కల్యాణోత్సవం నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే పీఠాధిపతులకు నంది వాహన సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు లింగోద్భవ రుద్రాభిషేకం, పాగలంకరణ ఉంటుంది. సంప్రదాయం ప్రకారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి ఎస్ లవన్న తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు. శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాల వేళ దాతలు వసతి పొందేందుకు వచ్చే నెల 10లోగా లిఖితపూర్వకంగా అందజేయాల్సి ఉంటుందని ఈవో లవన్న సూచించారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.
ఇలాఉండగా, మంగళవారం నుంచి ఆన్లైన్లో దర్శన టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే శ్రీ బ్రమరాంభ మల్లికార్జున స్వామి దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు తమ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో www.srisailadevasthanam.org వెబ్సైట్లో తమ కొవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. కాగా, ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆలయ పూజారులు 7 రోజుల హోమాలు చేయడం ప్రారంభించారు. ఆదివారం మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, ధన్వంతరి హోమం, పాశుపత హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.