(Bosta fire on Babu) విశాఖపట్నం: ఏపీలోని విపక్షాలపై మంత్రి బొత్స సత్సనారాయణ మండిపడ్డారు. ఏ మంచి పని చేసిన అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు ఊహాగానాలకు నేనెలా సమాధానం చెప్తానని అన్నారు. గతంలో మాదిరిగా గ్రాఫిక్స్ చూపితే అవార్డులు రాలేదని, నిజమైన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేపడుతుంటే విపక్షాలకు కండ్ల మంటగా ఉన్నదని మంత్రి బొత్స దుయ్యబట్టారు. క్లాప్ కార్యక్రమంతో పారిశుద్ధ్యంపై దృష్టి సారించామని, అందుకే గత ఏడాది రాష్ట్రానికి 10 అవార్డులు దక్కాయని చెప్పారు. గతంలో గ్రాఫిక్స్ మాయాజాలం చేసేవారని విమర్శించారు. ‘పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకుంటున్నారు. పేదలకు వినోదం అందుబాటులో ఉండాలని సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే విమర్శలు చేస్తారా? పెన్షన్ను పెంచుకుంటూ పోతామని ఆనాడే మా మేనిఫెస్టోలో చెప్పాం. అలాగే హామీని నెరవేరుస్తున్నాం. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు ఎలా ఊహాగానాలు చేస్తారు? ఆయనేమన్నా ఎలక్షన్ కమిషనా? లేక బీజేపీ సలహాదారా?’ అని బొత్స ప్రశ్నించారు.