అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి ఉండేదన్నారు. వేతన బిల్లులను రూపొందిస్తున్న వారిని పని చేసుకోనివ్వకుండా ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బాగోగుల గురించి ఉద్యోగ సంఘాల కంటే ఎక్కువగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చర్చలకు రావాలని పదే పదే ఉద్యోగ సంఘాల నేతలను కోరామన్నారు. ఫిట్ మెంట్పై అప్పుడు ఓకే చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని సజ్జల చెప్పారు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై సజ్జల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.
ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లకు, ఉద్యోగ సంఘం నేతలు చేస్తున్న డిమాండ్లకు ఏ మాత్రం సంబంధం లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించడం లేదని, హెచ్ఆర్ఎస్ స్లాబులతో నష్టం జరుగుతుందని అనుకుంటే దానిపై చర్చించేందుకు మంత్రుల కమిటీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.