విశాఖపట్నం: ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం ధ్యేయంగా పనిచేస్తున్నారని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాను అర్బన్, రూరల్, గిరిజన జిల్లాలుగా ఏర్పాటు చేయడంలోనే సీఎం పాలనా దక్షత కనిపిస్తున్నదని ఆయన అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం పట్ల జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారని, కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఆ హామీల్లో భాగమని శ్రీనివాసరావు కొనియాడారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన 30 సంక్షేమ పథకాలతో పాటు అనేక సేవలతో మ్యానిఫెస్టోలో 90 శాతం హామీలు నెరవేర్చామని వెల్లడించారు. పెరిగిన జిల్లాలతో పాటు రాష్ట్ర, కేంద్ర నిధులతో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అరకు పార్లమెంట్ను రెండు జిల్లాలుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.