అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్(Sez)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు కార్మికులు పైలా సత్తిబాబు, ఉప్పాడ తిరుపతి చికిత్స పొందుతూ మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్ కేజీహెచ్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కాగా ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది.