(Annamayya Ghat road) తిరుమలలో కొత్త ఘాట్ రోడ్డు నిర్మాణం వివాదానికి బింధువుగా మారింది. దీని నిర్మాణంపై బోర్డు చేసిన ప్రకటన ప్రస్తుతం రగడకు కారణంగా మారింది. ప్రస్తుతమున్న రెండు మార్గాలకు తోడు.. భక్తులు రావడానికి వీలుగా మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని ఇటీవల టీటీడీ బోర్డు నిర్ణయించింది. అయితే, ఈ అన్నమయ్య మార్గం నిర్మాణం ప్రకటనను తిరుపతి వాసులు, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్గం ఏర్పాటుతో తిరుపతి నగరం చారిత్రక వైభవం కోల్పోతుందన్న కొత్త వాదన తెరపైకి వస్తుండటమే కాకుండా అలిపిరి మార్గం ఉనికికే ప్రమాదం నెలకొనే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.
మూడో ఘాట్ రోడ్డు అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేసినట్లయితే రేణిగుంట విమానాశ్రయంలో దిగే భక్తులతో పాటు కడప, కర్నూలు, హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, తమిళనాడు నుంచి వచ్చే భక్తులు మామండూరు మార్గం వైపు నుంచి తిరుమల చేరుకుంటారు. ఫలితంగా వీరెవరూ తిరుపతి వైపు కన్నెత్తి చూడరని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే తిరుపతిలోని తమ దుకాణాలు, హోటళ్లు, ఆస్తులు మూతపడగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలోకి తనను లాగొద్దని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కోరుతుండగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అభివృద్ధి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతుండటం విశేషం.