అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే అరాచకాలు, అక్రమాలు కొనసాగుతున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. జంగిల్రాజ్ జగన్ పాలనలో ప్రజలకు భద్రత కరవైందని తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులను లేఖలో చంద్రబాబు సవివరంగా రాశారు. ఆయా ఘటనల్లో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేఖతో పాటు మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను జతచేశారు.
రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు గూండాల్లా పేట్రేగిపోతున్నారని, వారిని అదుపుచేయడంలో పోలీసు శాఖ విఫలమవుతున్నదని చంద్రబాబు తెలిపారు. శాంతిభద్రతలు సక్రమంగా లేకపోవడం వల్లనే రేపల్లె రైల్వేస్టేషన్లో ఓ మహిళపై లైంగికదాడి జరిగిందని పేర్కొన్నారు. విచ్చలవిడిగా మద్యం, గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయని.. ఫలితంగా చెప్పలేనంతగా నేరాలు పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీస్ శాఖ దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు.