విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. గత కొంతకాలంగా గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం కానరావడం లేదు. ఎక్కడ ఏ ముఠా అరెస్టైనా.. వారి లింకులు మాత్రం ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉంటున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన ఘటన ఏపీలో గంజాయి ముఠా ఆగడాలను బట్టబయలు చేసింది. నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది.
మహారాష్ట్రకు చెందిన సిద్ధు, ఇఫ్రాన్, రోహిత్.. చింతపల్లిలో 240 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారులో మహారాష్ట్రకు వెళ్తుండగా నర్సీపట్నం డౌనూరు చెక్పోస్టు వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో గంజాయి ముఠా కారు ఆటోను ఢీకొట్టింది. సినిమా తరహాలో వాహనాలను ధ్వంసం చేస్తూ వేగంగా ముందుకు సాగింది. ఆబిద్ సెంటర్లో ఒక మహిళను కూడా ఈ ముఠా కారు ఢీకొట్టింది. స్థానిక ఎస్ఐ టూవీలర్పై, మరికొందరు పోలీసులు ఇతర వాహనాల్లో గంజాయి ముఠాను వెంబడించారు. చాలా దూరం వరకు పోలీసులు వెంబడించడంతో ఇక తప్పించుకోలేమని గంజాయి ముఠా నిర్ధారణకు వచ్చి కారును వదిలేసి పలాయనం చిత్తగించారు.
అయితే, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముఠాలోని ఇద్దరు నిందితులు పెదబొడ్డేపల్లి సమీపంలోని పెద్ద చెరువులో దూకారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు చెరువును చుట్టుముట్టి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.