(APSRTC and GST) విజయవాడ: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రయాణికులకు ఆర్టీసీ చేదు వార్తను వినిపించింది. ఇకపై ప్రైవేట్ ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్బస్, పేటీఎం పోర్టళ్లలో బస్ టికెట్లు కొనుగోలు చేసేవారు 2022 జనవరి 1 నుంచి తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్ లేదా ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు అదేవిధంగా నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు మాత్రం ఎలాంటి జీఎస్టీ విధించరని అధికారులు తెలిపారు. అందుకే ప్రైవేట్ ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా కాకుండా ఆర్టీసీ అధికారిక పోర్టల్, ఏజెంట్ల నుంచే బస్ టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.