అనంతపురం: అతడో బ్యాంకు ఉద్యోగి. ఐదంకెల జీతం. అందమైన భార్య. ఇద్దరు కుమార్తెలు. హాయిగా ఉద్యోగం చేస్తూ.. భార్యా పిల్లలతో ఆనందంగా గడపాల్సి పోయి.. అత్యాశకు లోనయ్యాడు. ఇద్దరు కుమార్తెల చదువు, ఆలనాపాలనా పేరుతో మరింత కట్నం తేవాలంటూ భార్యను వేధించసాగాడు. భర్త ఆగడాలు భరించలేక చివరకు ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యువతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని నేసిపేటకు చెందిన వెంకటకృష్ణ తాడిమర్రి ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె వెంకట సుజన (26)తో 2016లో వివాహమైంది. వివాహ సమయంలో సుజనా తల్లిదండ్రులు కట్నం కింద రూ.18 లక్షలతో పాటు 300 గ్రాముల బంగారు ఆభరణాలు అందించారు. కొంతకాలం ప్రశాంతమైన జీవితం గడిపిన ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అయితే, ఇటీవల సుజనా, వెంకటకృష్ణల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సుజన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోని మూడో అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అదనపు కట్నం కోసం వెంకటకృష్ణ తమను చిత్రహింసలకు గురిచేశాడంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్కు ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతురాలి భర్త వెంకటకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.