TDP-Janasena | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 118 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీ 94 సీట్లలో పోటీ చేస్తుండగా.. జనసేన కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం ఇప్పుడు ఏపీలో రాజకీయంగా దుమారం లేపింది. జనసేన మద్దతు లేకపోతే టీడీపీ గెలవదంటూ ఇన్నిరోజులు చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 24 స్థానాలకే పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ మంత్రులు తీవ్ర విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కేవలం 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ సీట్లు మాత్రమే కేటాయించడంతో వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీల బలహీనతలు బయటపెట్టాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాపులను కమ్మలు.. కమ్మవాళ్లను కాపులు నమ్మడం లేదనే విషయం అర్థమైందని విమర్శించారు. కేవలం 24 సీట్లకే పరిమితమైనందుకు జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు.
అభ్యర్థుల జాబితాను చూసి టీడీపీ, జనసేన కార్యకర్తలు ఏడుస్తున్నారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే పవన్ ఒప్పుకున్నారని ప్రశ్నించారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని పవన్..చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. పవన్ రాజకీయాలకు పనికిరారు అని అన్నారు.
అభ్యర్థులను ప్రకటిస్తే ఎన్నికలకు సిద్ధమైనట్టేనా అని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. దేశంలోని అన్ని పార్టీలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని అన్నారు. 24 సీట్లు చాలని పవన్ అనుకుంటున్నారేమో అని అభిప్రాయపడ్డారు.