రసాయన ఎరువులు,పురుగు మందులతో భూసారం తగ్గిపోతున్నది.పంటలకు పనికి రాకుండా నేల తయారవుతున్నది. ఈ తరుణంలో భూమిలో పోషకాలను పెంపొందించుకోవాల్సిన అవసరంఉన్నది. పొలంలో పచ్చిరొట్ట సాగుచేయడం ద్వారా..నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.ప్రధాన పంటల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను పెంపొందించుకోవచ్చు. ఫలితంగారసాయనిక ఎరువుల వాడకంతో పాటు సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.
యాసంగికి అనువైన పచ్చిరొట్ట పంటల సాగు, వాటి సాధ్యాసాధ్యాలపై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ప్రాథమిక పరిశీలన చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 వానాకాలం సీజన్కు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను అందించేందుకు కృషి చేస్తున్నది. తెలంగాణ ప్రాంతానికి అనువైన.. పెసర, మినుము, ఉలవ, అలసంద, జనుము, జీలుగతోపాటు పిల్లిపెసరను సాగు చేసుకోవచ్చు. తెలంగాణలో కాలువలు, బోరు బావుల కింద వివిధ పంటలు ఎకువ విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పంటలు వేయడానికి 40 నుంచి 50 రోజుల ముందు పచ్చిరొట్ట పంటలను సాగు చేసి, పూత దశకు రాగానే నేలలో కలియదున్నడం పరిపాటి. దీనివల్ల భూసారం పెరిగి, నేల ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా నేలలో సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతుంది. తర్వాత వేసే పంటకు పోషకాల లభ్యత పెరుగుతుంది.
రాష్ట్రంలో పచ్చిరొట్ట సాగు తకువగా ఉన్నది. దీంతో అనుకున్నంతగా నేల పోషణ లక్ష్యాలను సాధించడం లేదు. ఈ నేపథ్యంలో వివిధ పచ్చిరొట్ట పంటలను యాసంగిలో సాగుచేసి, జనుము, అలసంద పంటలు తెలంగాణ నేలలకు అనువైనవిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. జనుము, అలసంద పంటలను యాసంగిలో 50% పూత దశ దాకా సాగు చేసి, నేలలో కలియదున్నవచ్చు. లేదా విత్తనోత్పత్తి చేసి పంట మొదళ్లను నేలలో కలియదున్నవచ్చు. ఈ రెండు పంటలను వాటి సాగుకు సిఫార్సు చేసిన మోతాదుల్లో.. అంటే జనుముకు 5 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం (ఎకరానికి), అలసందకు 10 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ను (ఎకరానికి) దుకిలోనే వేసుకొని సాగు చేసుకుంటే.. తర్వాత వేసుకొనే ప్రధాన పంటల ఎదుగుదల బాగుంటుంది.
జనుము పంట సుమారు ఒక మీటరు వరకు ఎత్తు పెరుగుతుంది. ఎకరానికి 600 కిలోల నుంచి ఒక టన్ను దాకా పచ్చిరొట్టను ఉత్పత్తి చేస్తుంది. అలసంద సుమారుగా 55 సెం.మీ. ఎత్తు పెరిగి, 500 నుంచి 800 కిలోల పచ్చిరొట్టను అందిస్తుంది. యాసంగిలో 50% పూత దశకు చేరుకోవడానికి జనుముకు దాదాపు 58-60 రోజులు, అలసందకు 65-75 రోజులు పడుతుంది. 50% పూత దశలో జనుము 3-3.5% నత్రజని, 0.45-0.5% భాస్వరంతోపాటు 15-10% పొటాష్ను అందిస్తుంది. అలసంద 15-20% నత్రజని, 0.30-0.40% భాస్వరం, 40-15% పొటాష్ను అందించగలదు. ఈ రెండు పంటలు 50% పూత దశలో నేలలో కలియదున్నితే.. 20 నుంచి 30 రోజుల్లో కుళ్లిపోయి, నేలకు పోషకాలను అందిస్తాయి. నేలలో కలియదున్నిన 10 రోజులకు నత్రజని విడుదల అధికంగా ఉంటుంది. తరువాత క్రమేణా నత్రజని విడుదల తగ్గుతుంది. కాబట్టి, నీటి లభ్యత ఉండి వేసవి పంట వేసుకోవాలనుకునే రైతులు పచ్చిరొట్ట పంటలను నేలలో కలియదున్నిన వెంటనే ప్రధాన పంటలను వేసుకోవాలి. ఫలితంగా పంట మొలకెత్తిన తరువాత మొకలకు అవసరమైన పోషకాలు సరైన సమయంలో అందుతాయి.
జనుము, అలసంద పంటలను పూత దశలో కోయకుండా, విత్తనోత్పత్తి తర్వాత మొదళ్లను కలియదున్నడం ద్వారా నేల పోషణను సాధించవచ్చు. యాసంగిలో విత్తన పంటలుగా జనుము 125-130 రోజులకు, అలసంద 110-115 రోజులకు కోతకు వస్తాయి. విత్తనం కోసం సాగు చేసినప్పుడు, జనుము దాదాపుగా 1.5 మీ. ఎత్తు పెరిగి, ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి ఒక టన్ను వరకు విత్తనం, 1.8-2.2 టన్నుల పచ్చిరొట్టను ఉత్పత్తి చేస్తుంది. అలసంద 1 మీ. నుంచి -1.2 మీ. ఎత్తు పెరిగి, 6-8 క్వింటాళ్ల విత్తనంతోపాటు 3-3.5 టన్నుల పచ్చిరొట్టను ఉత్పత్తి చేస్తుంది. పంట కోత తర్వాత జనుము, అలసంద మొదళ్లను నేలలో కలియదున్నవచ్చు. జనుము మొదళ్లు 2.5-3.0% నత్రజని, 0.03-0.05% భాస్వరం, 0.35-0.40% పొటాష్ను అందించగలవు. అలసంద మొదళ్లు 2.0-2.5% నత్రజని, 0.08-0.10% భాస్వరం, 0.55-0.60% పొటాష్ను అందించగలవు. 50% పూత దశ కంటే పంట కోత తరవాత మొదళ్లను కలియ దున్నడం వల్ల అవి చివకడానికి రెండు నీటి తడులతో 60 నుంచి 70 రోజులు పడుతుంది. నేలలో కలియదున్నిన మొదళ్లు త్వరగా చివకడానికి యూరియా (1.0%), సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని (1.0%) లేదా వీటితోపాటు వేస్ట్ డీకంపోజర్ను (ఎకరాకి 100 లీ.) కలిపి మొదళ్లపై పిచికారీ చేయాలి. ఆ తర్వాత నేలలో కలియ దున్నితే ఇవి 40-50 రోజుల్లో చివికి, నేలకు పోషకాలను అందించగలవు. పంట మొదళ్లు క్రమేణా కుళ్లడం వల్ల వానాకాలం పంటల పోషణ అవసరాలను తీరుస్తాయి.
వేప, కానుగ, తంగేడు : వీటి కొమ్మలు, ఆకులను పొలంలో కలియదున్ని మురగనివ్వాలి. దీనివల్ల అనేక పోషకాలు పంటకు అందుతాయి. క్రిమిసంహారక మందుగానూ ఉపయోగపడుతాయి.
ప్రయోజనాలు :
పచ్చిరొట్ట విత్తనాల్లో మొలక శాతం తక్కువగా ఉన్నదంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతులు అలాంటి అపోహలను నమ్మవద్దని సూచిస్తున్నారు. పూర్తిస్థాయిలో నాణ్యతా పరీక్షలు జరిపిన తర్వాతే విత్తనాలను సేకరించినట్టు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో జీలుగ 75%ం, జనుము 80% మొలక నిర్ధారణ అయ్యిందని వారు స్పష్టం చేస్తున్నారు.
పచ్చిరొట్ట పంటల విత్తనాలను రైతులు స్వయంగా ఉత్పత్తి చేసుకోవడమే మేలు. రాష్ట్రంలో కొందరు రైతులు ఈ విధానంలోనే పచ్చిరొట్టను సాగు చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. ఈ విధానంలో రైతులు పచ్చిరొట్ట విత్తన ఉత్పత్తితోపాటు నేల సారాన్ని పెంపొందించవచ్చు. రెండు మూడు కాలాలపాటు పచ్చిరొట్టను సాగు చేయడం ద్వారా నేలలో సూక్ష్మజీవుల సాంద్రత పెరిగి, పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. అంతే కాకుండా నేల భౌతిక, రసాయనిక పరిస్థితులు మెరుగుపడతాయి. నీరు నిల్వ ఉండే పొలాలతోపాటు భీడు భూముల్లో పచ్చిరొట్ట సాగు ద్వారా నేల భౌతిక లక్షణాలు మెరుగుపడుతాయి. ఇతర పంటలు పండించడానికి అనువుగా మారుతాయి.
-ఎం. శ్రీనివాస్రెడ్డి, టి.మాసయ్య