ఉట్నూర్, జనవరి 16 : ఉట్నూర్ పట్టణంలోని కుమ్రం భీం(కేబీ) ప్రాంగణంలో బుధవారం గురుకులాల ఇంటర్ సొసైటీ లీగ్ రాష్ట్రస్థాయి పోటీలను ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, జాదవ్ అనిల్కుమార్తో కలిసి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని వెలిగించడంతోపాటు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెలికి తీసేందుకే రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో గ్రామస్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరిలో సంసద్ ఖేల్ నిర్వహించనున్నామన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. కేజీబీవీ, గురుకులాలను ఆప్గ్రేడ్ చేయాలని గురుకులాల డైరెక్టర్ను కోరారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే జాదవ్ అనిల్ మాట్లాడుతూ.. బోథ్ నియోజకవర్గంలోని జాతర్ల గ్రామంలో కేసీఆర్ ప్రభు త్వం ఏర్పాటు చేసిన క్రీడాపాఠశాలలో కూడా రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించాలని కోరారు. అనంతరం ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్, ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహాజమని పే ర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకులాల డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, నాయకురాలు కుమ్ర ఈశ్వరీబాయి పాల్గొన్నారు.