కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కౌటాల, మార్చి 20;కరోనా తర్వాత చాలా కుటుంబాల్లో పెనుమార్పు వచ్చింది. ఉద్యోగాలు పోయి కొందరు.. వర్క్ ఫ్రం హోం పేరిట మరికొందరు స్వగ్రామాల బాట పట్టారు. అలా ఇంటి నుంచే ఉద్యోగం చేసేందుకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీమణి సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టి ఆదర్శంగా నిలిచింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విజయనగరానికి చెందిన మాదాసు సునంద ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీ పూర్తి చేసింది. లెక్చరర్గా మొదలైన తన ప్రస్థానాన్ని వదిలి ఫార్మింగ్ వైపు అడుగులేసింది. భర్త ప్రోత్సాహంతో పద్నాలుగెకరాల్లో వివిధ పంటలు పండిస్తూ గుర్తింపు సాధించింది. సేంద్రియ పద్ధతిలో మంచి దిగుబడులు సాధిస్తూ, ఉత్పత్తులను సోషల్ మీడియా, కార్గో సేవలను సద్వినియోగం చేసుకొని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నది. మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఈ యువ మహిళా రైతుపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విజయనగరం గ్రామానికి చెందిన మాదాసు సునంద ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పూర్తి చేసింది. తిరుపతిలోని పద్మావతి ఇనిస్టిట్యూల్లో రెండేళ్లు లెక్చరర్గా ఉద్యోగం చేసింది. భర్త హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇద్దరు పిల్లలు. తొలుత అంతా హైదరాబాద్లో నివాసం ఉండేవారు. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు చేయాల్సి రావడంతో తమ గ్రామమైన కౌటాల మండలంలోని విజయనగరానికి మకాం మార్చారు. అప్పుడే వ్యవసాయం చేయాలనే ఆలోచన సునందకు తట్టింది. భర్త కూడా ప్రోత్సహించడంతో తమకున్న ఎనిమిదెకరాల్లో, తొలుత మూడెకరాల్లో సేద్యాన్ని మొదలుపెట్టింది.
తొలుత వినూత్న పంటలు
మూడు ఎకరాల్లో ని 10 గుంటల స్థలంలో బ్లాక్ రైస్, 10 గుంటల్లో రెడ్ రైస్, ఎకరం కుసుమ, 10 గుంటల్లో శనగలు, 10 గుంటల్లో అవశలు వేశారు. ఈ పంటలన్నింటికీ స్ప్రే చేసేందుకు తన పొలంలో 10 ఫీట్ల వెడల్పుతో గుంత తీసి మట్టి సేకరించారు. గుంతలో తీసిన మట్టిని తడిపి ఆరబెట్టి దానిలో ఆముదాల పిండి కలిపి ఈ మిశ్రమాన్ని పంటలపై పిచికారీ చేశారు. మొదటి విడుతగా 4.5 క్వింటాళ్ల బ్లాక్ రైస్, 2 క్వింటాళ్ల రెడ్ రైస్, 8 క్వింటాళ్ల కుసుమలు, 3 క్వింటాళ్ల శనగలు, 2 క్వింటాళ్ల అవశల దిగుబడి వచ్చింది. వీటితో పాటు ప్రయోగాత్మకంగా బఠానీ, ఎర్ర ఆవాలు, వేరుశనగ, కొర్రలు, సజ్జల పంటలను ప్రయోగాత్మకంగా వేశారు.
సేంద్రియ సేద్యంతోనే..
సేంద్రియ పద్ధతిలో దిగుబడి లాభసాటిగా రావడంతో రెండో విడుతలో పంటల సాగు విస్థీర్ణం పెంచారు. బ్లాక్ రైస్, రెడ్ రైస్తో పాటు నారా రకం( కేరళ రకం) వరి పంటను 1.5 ఎకరాల్లో వేశారు. వీటితో పాటు కుసుమ, శనగలు, అవశలు వేశారు. సేంద్రియ పద్ధతిలో వేసిన పంట కావడంతో మార్కెట్లో ధర రెట్టింపు పలికింది. తమకున్న ఎనిమిదెకరాలకు తోడుగా మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పసుపు, కందులు, పెసలు, ఆముదాలు, మినుములు, కూరగాయలు బీర, కాకర, చిక్కుడు, క్యాబేజి తదితర 20 రకాల పంటలు పండిస్తున్నారు. ఈ పంటల సాగులో సునందకు ఆమె భర్త రవికుమార్ సహాయం అందిస్తున్నాడు.
సోషల్మీడియా, కార్గో ద్వారా..
సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ఆమె స్థానిక సంతల్లో విక్రయించడంతోపాటు పదికిలోలకు పైగా అవసరమైన వారికి కార్గో ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్, సమీప జిల్లాలకు ఆమె కూరగాయలు రవాణా చేస్తున్నారు. ఆర్గానికి ఉత్పత్తులను విక్రయించే వారిని సంప్రదించి తమ మార్కెటింగ్ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు సోషల్ మీడియా ద్వారా తన వ్యవసాయ క్షేత్రంలోని సాగు వివరాలను పంచుకుంటున్నారు. అవసరమైతే సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తానని సునంద చెబుతున్నారు.
ఎరువుల తయారీ ఇలా..
పంటల సాగులో ఎరువులు సిద్ధం చేసుకోవడమే ప్రధానం. ఆవుపేడ, పచ్చిరొట్ట, ఇతర సేంద్రియ పదార్థాలను వినియోగిస్తూ ఎరువులను తయారు చేస్తున్నారు. ఆముదం నూనె, వెల్లుల్లి కలిపి ఎరువులను తయారు చేస్తారు. నేలను దున్నే సమయంలోనే వాటిని కలిపేస్తారు. పంటలను ఆశించే పురుగులను నివారించేందుకు రసాయనిక మందులకు బదులు మట్టి ద్రావణాలనే వినియోగిస్తున్నారు.
సేంద్రియ ఉత్పత్తులే ఆరోగ్యం
ప్రస్తుతం మారుతున్న జీవన సరళిని బట్టి ప్రకృతి సేద్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి పద్ధతుల్లో పండించే కూరగాయలు, బియ్యం, ఇతర ఆహార దినుసులకు మంచి డిమాండ్ ఉంది. మా బాబుకు కంటి చూపు సమస్య ఉండేది. ఆర్గానిక్ ఆహారం ఇవ్వడం మొదలుపెట్టాక, కొంత మేర మెరుగుపడింది. రైతులను చైతన్యం చేసేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్న. సేంద్రియ సాగే మంచిది. అనవసర క్రిమి సంహారక మందులు వాడి ఆరోగ్యాన్ని, భూమిని చెడగొట్టుకోవద్దు. సేంద్రియ వ్యవసాయంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సిస్టం ఆఫ్ క్రాప్ ఇంటన్సిఫికేషన్ -2022 సదస్సులో పాల్గొన్న. దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు, శాస్త్రవేత్తలు ఈ సదస్సులో తమ అనుభవాలను వివరించారు. గతేడాది ‘రైతే రాజు’ పురస్కారం కూడా వచ్చింది.
– సునంద