కెరమెరి, నవంబర్ 4 : దండారి.. అంటేనే ఆదివాసీ గూడేల్లో వినోదాల వేడుక. యేటా ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పండుగ నేటితో ప్రారంభం కానున్నది. ఝరి గ్రామంలో సంప్రదాయబద్ధంగా భోగి పండుగ జరుపుకోనున్నారు. డప్పుల దరువు, గజ్జెల మోతలు.. గుస్సాడీల నృత్యాలతో గూడేలన్నీ మారుమోగనున్నాయి. ఓ వైపు కోలాటాలు, మరోవైపు గోండిపాటల నృత్యాలు, హాస్యనాటికల ప్రదర్శనలతో ఈ వేడుక సాగనున్నది. దీపావళికి ముందు భోగి పండుగతో ప్రారంభం కానున్న ఈ వేడుక కొలబొడితో ముగిస్తుంది.
అత్యంత సంప్రదాయంగా కొనసాగే దండారి వేడుక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆశ్వీయుజ పౌర్ణమి అనంతరం ప్రారంభమయ్యే అద్భుతమైన ఆదివాసీల ముఖ్యమైన పండుగ. దండారి సంబురాలను చూసేందుకు పల్లె ప్రజలతో పాటు పట్టణవాసులు సైతం ఆసక్తి చూపిస్తారు. దాదాపు వారం, పది రోజుల పాటు జరుపుకునే దండారి పండుగను గూడేల్లో వైభవంగా నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రత్యేక పండుగగా గుర్తించింది. యేటా దండారి ఉత్సవాలకు రూ. కోటి విడుదల చేసి ఒక్కో దండారి బృందానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయమందిస్తున్నది.
దండారి వేడుకల్లో గుస్సాడీల పాత్ర కీలకమైంది. నెమలి పింఛంతో చేసిన టోపీలు, టోపికి ముందు రెండు పశువుల కొమ్ములు, మధ్యలో ఓ అద్దం, చుట్టూ అలంకరణ వస్తువులు, భుజానికి వన్యప్రాణుల తోలు, నడుము, కాళ్లకు గజ్జెలు, మెడలో రుద్రాక్షమాల వేసిన ఆదివాసీ దేవుని ప్రతిరూపమే గుస్సాడీలు. గోండి భాషలో వారిని గుస్సాడీకి బదులు ‘గురు’ అని పిలుస్తారు. భోగి పండుగతో మాలధారణ వేసిన్నప్పటి నుంచి వారు దీక్షలో కొనసాగుతారు. దీక్ష చేపట్టిన నాటి నుంచి పూర్తయ్యే వరకు స్నానాలు ఆచారించకుండా, చలిలోనూ పాదరక్షలు, అర్ధ దుస్తులు ధరించి, మంచం, కుర్చీలు, సోపాలో కాకుండా నేల పైనే కూర్చోవడం, నిద్రించడం వారి ఆచారం.
దండారి ఉత్సవంలో పాల్గొనే గుస్సాడీల తర్వాత మరో కీలక పాత్ర పోరీలది(ఆడ వేషధారణలో ఉండే యువకులు). వీరు కూడా గుస్సాడీలతో చివరి రోజైన కొలబొడి వరకు దీక్షలో కొనసాగుతారు. ఏ ఊరికి వెళ్లిన, ఏ ఇంటిని సందర్శించిన ఈ పోరీలు మంగళహారతులతో అష్ట, ఐశ్వర్యాలు కలగాలని, కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు కలగాలనీ దీవిస్తారు.
ఓ గ్రామానికి చెందిన దండారి బృందం మరో గ్రామానికి బయలు దేరి వెళ్లడం.. అదో వినోదపు కార్యక్రమం. గుస్సాడీ బృందం ఏ గ్రామానికి వెళ్లాలన్నా రాత్రి పూట వెళ్లడం ఆచారం. రాత్రంత నృత్యాలు, గోండి పాటలపై డ్యాన్సులు, హాస్యపు నాటికలు ప్రదర్శించి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తారు. ఇక ఉదయం మాన్కోలాతో నృత్య ప్రదర్శనలు మొదలై సార్కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అథితులకు ఘన స్వాగతం పలికిన అనంతరం మరుసటి రోజున ప్రత్యేక విందును ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. దీంతో ఇరువువైపులా స్నేహభావం పెంపొందడంతో పాటు సంస్కృతీ సంప్రదాయల పరిరక్షణకు తోడ్పడుతుంది.
ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుపుకున్న తర్వాత కొలబొడితో వేడుకలు ముగిస్తారు. తమ కార్యక్రమాలు, అతిథుల రాకపోకలు పూర్తి కాగానే గ్రామంలోని దండారి బృందం ఇంటింటికీ వెళ్లి దర్శనం ఇస్తారు. దీంతో ఇంటి గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచిన నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తారు. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తారు. ఇలా అన్ని ఇండ్లు పూర్తి కాగానే.. కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు.
దండారిలో ఆరాధ్య దేవత పద్మల్పురికాకో ప్రధానమైనది. ఇందులో ఏత్మాసార్ పేన్ పేరిట నాల్గు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు. నాల్గు సగలవారు గుమ్మేల, 5 సగల వారు ఫర్ర, 6 సగల వారు కోడల్, 7 సగల వారు తపల్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా కోలాట, మహిళల బృందాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ వేడుకల్లో భేటికోలా, మాన్కోలా, సదర్కోలా, కోడల్కోలా, సార్కోలా, కలివల్కోలావంటి అనేక రకాలుగా నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం.