ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే ఏ ఆహార పదార్థాన్ని కొనాలన్నా జంకే పరిస్థితి. కారణం, అందులో విశృంఖలంగా వాడే ఉప్పు, చక్కెర, మైదాపిండి. అయితే, తాము తయారు చేసే స్నాక్స్ కచ్చితంగా శక్తినిస్తాయని, అవి పూర్తిగా ఇంటి వంటల్లాగే ఉంటాయని చెప్తున్నారు ‘యోగా బార్’ బ్రాండ్ ఫౌండర్లు. ఈ స్టార్టప్ని ఐదేండ్ల క్రితం బెంగళూరుకు చెందిన సుహాసిని, అనింద అనే వదినా మరదళ్లు ప్రారంభించారు. స్నాక్స్ను, ప్రొటీన్ బార్స్ను చాలా ఆరోగ్యకరమైన పద్ధతుల్లో, శుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారు. యోగా బార్ బ్రాండ్నుంచి ఏ కొత్త ప్రొడక్ట్ని తీసుకు రావాలన్నా ఆ వదినా మరదళ్లు చాలా జాగ్రత్తలు పాటిస్తారట. ఆరోగ్యవంతమైన బ్రేక్ఫాస్ట్ కోసం ఇన్స్టంట్ ప్రొడక్ట్స్ అయిన సూపర్ ఓట్స్, పీనట్ బటర్ను మార్కెట్లో విడుదల చేశారు. లాక్డౌన్ సమయంలో కొవిడ్ బారిన పడిన పేదలకు లక్ష ప్రొటీన్ బార్లను అందజేసి ఉదారతను చాటుకున్నారు ఇద్దరూ. “యోగా బార్ బ్రాండ్కింద మేం వీక్లీ సిరీస్ని ప్రారంభించాం. అదే ‘హ్యాపీ న్యూస్ డైజెస్ట్’. ప్రపంచవ్యాప్తంగా మంచివార్తలను ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. అలాగే, మా బ్రాండ్ద్వారా రోజూ సెల్ఫ్కేర్, మానసిక-శారీరక ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ని పోస్ట్ చేస్తున్నాం” అన్నది సుహాసిని.