‘పడుగు పేకల అల్లిక కాదు. రంగుల అద్దకం అంతకంటే కాదు. కులవృత్తి కానేకాదు. చేనేత అందమైన ఆర్ట్. సృజనాత్మక వ్యక్తీకరణ..’ అంటున్నది కార్వాన్కు చెందిన కందగట్ల కుటుంబం. వంశపారంపర్యంగా ఇంటినే కార్ఖానాగా మార్చుకుని.. ఆధునిక చేనేత డిజైన్లు రూపొందిస్తున్నారు వాళ్లంతా. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ కుటుంబంపై ‘జిందగీ’ ప్రత్యేక కథనం..
ఆ ఇంటి పిల్లలు మగ్గం గుంతల్లో దాగుడు మూతలు ఆడుకుంటారు. రంగురంగుల దారాలను మెడలో హారాలుగా వేసుకుంటారు. అదో చేనేత కుటుంబం. నేతే సర్వస్వమైన ఇల్లు. వరంగల్లు బ్రాహ్మణవాడికి చెందిన కందగట్ల సాంబయ్య శతాబ్దాల క్రితమే చేనేత వృత్తిని నమ్ముకుని పాతబస్తీకి వచ్చాడు. బెస్తవాళ్ల ఇంట్లో మగ్గం పెట్టాడు. అరబ్బులు ధరించే చిట్కీ లుంగీలు, మొరమాండ్ల నేతలో కొత్త ప్రయోగాలు చేసి నిజాం మెప్పు పొందాడు. ఆ తరువాత ఆయన కొడుకు సాంబయ్య (తండ్రీ కొడుకులది ఒకే పేరు!) నిజాం భద్రతా సిబ్బందికి యూనిఫామ్లు రూపొందించాడు. పోలీస్ అధికారుల క్యాడర్ను సూచించే పట్కాలు, తలపాగాలు, మేజోళ్లు, సాక్స్లు డిజైన్ చేశాడు. మూడోతరంలో నాగయ్య కూడా ఇదే వృత్తిని కొనసాగించాడు. ఆయన తన యులు ముగ్గురూ.. కందగట్ల నర్సింహులు, సత్యనారాయణ, అశోక్ కార్వాన్లోని మార్కండేయ నగర్లో ఉంటున్నారు. ఎవరికివారు చేనేత దిగ్గజాలే. మగ్గంపై వినూత్న ప్రయోగాలు చేస్తారు. యూరప్ దేశాలకు చేనేత వస్ర్తాలను ఎగుమతి చేస్తున్నారు.
కుటుంబ పెద్ద కందగట్ల నర్సింహులు తమ పూర్వికులు తయారుచేసిన పోలీస్ పట్కాలకు తిరిగి జీవం పోశాడు. అవి ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో కొలువుతీరాయి. చిట్కీ లుంగీల్లోనూ ఆధునికతకు అనుగుణంగా చేసిన ఇక్కత్, డబుల్ ఇక్కత్ ప్రయోగాలు మన్నన పొందాయి. ఒక్క కుట్టు కూడా లేకుండా బెడ్ కవర్ రూపకల్పన చేశాడు. 250 ఇంచుల అడ్డం-నిలువు కొలతతో మగ్గంపైనే భారీ వస్ర్తాన్ని తీర్చిదిద్దాడు. తంజావూరు ఆలయంలో అందరినీ ఆకర్షించే ఒకే తలతో కనిపించే ఏనుగు, నంది శిల్ప చిత్రానికి మగ్గంపై ప్రాణంపోశాడు. ప్రస్తుతం, కందగట్ల కుటుంబం దాదాపు 30 దేశాల జాతినేతల చిత్రాలను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికీ చెట్ల రసాలతో స్వయంగా తయారు చేసుకున్న రంగులనే వాడతారు. నర్సింహులు ఏకంగా 1,52,076 వర్ణాలతో చీరను రూపొందించి రికార్డు సృష్టించాడు. కందగట్ల కుటుంబం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థులతోపాటు, హైదరాబాద్లోని పలు డిజైన్, టెక్నాలజీ సంస్థలలో పాఠాలు చెబుతున్నారు. ఈ కుటుంబ కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. నర్సింహులు జాతీయస్థాయిలో శాంతాప్రసాద్ అవార్డును అందుకున్నాడు. ఆయన భార్య బాలమణి సైతం డబుల్ డోరియా, డబుల్ ఇక్కత్తో చీరను రూపొందించి.. జాతీయస్థాయిలో మాస్టర్ ఆఫ్ క్రాఫ్ట్ ఉమెన్ అవార్డుకు ఎంపికైంది. నర్సింహులు రెండో సోదరుడు సత్యనారాయణ కొండా లక్ష్మణ్బాపూజీ పురస్కారాన్ని స్వీకరించాడు. ‘చేనేత గొప్ప కళ. మగ్గం మీద అందమైన చీరను తీర్చిదిద్దే క్రమంలో ప్రతి దశలోనూ అనేక జాగ్రత్తలు పాటించాలి. ఇంత గొప్ప వారసత్వాన్ని కలిగిన చేనేతపై మోదీ సర్కారు జీఎస్టీ విధించడం శోచనీయం. కేంద్రం ఆ భారాన్ని తొలగించాలని కోరుతున్నాం’ అంటారు సత్యనారాయణ దంపతులు.
– మ్యాకం రవికుమార్