ఓ రాజ్యం. ఆ రాజ్యంలో చెరువు.ఆ చెరువులో ఏడు చేపలు… అని మొదలుపెట్టడానికి వీల్లేదు. ఇక్కడ ఒక రాజు, ఏడుగురు కొడుకులు.. ఉండరు.కథ మొత్తంలో ఒక పేదరాలే ఉంటుంది. ఆమె పేరు సౌజన్య.‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’ తరహాలో..‘కష్టాలూ కష్టాలూ నన్నే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?’ అని ఎవర్నీ నిందించలేదు సౌజన్య. సవాళ్లకు ఎదురుపడింది. తిరగబడింది.
కష్టసుఖాలు పంచుకోవాల్సిన భర్త తెగతెంపులు చేసుకొన్నాడు. నీడనిస్తారనుకున్న తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఆసరా అయితడనుకున్న అన్న పరిస్థితీ అంతంతమాత్రమే. స్పష్టత వచ్చేసింది. తన బతుకు తనదే. తన పోరాటం తనదే. కష్టాల అగాథం నుంచి నీళ్లవైపు నడిచింది. సమస్యల వలయాన్ని తెంచుకుని చేపల వల పట్టుకుంది. మాంకాలి సౌజన్య సొంతూరు జనగామ జిల్లా, కొడకండ్ల మండలం నర్సింగాపురం. చిన్నతనంలోనే పెండ్లయింది. రెండు పదులు దాటకముందే ఇద్దరు పిల్లలు పుట్టారు. అంతలోనే, భర్తతో విభేదాలు వచ్చాయి. పెద్దల పంచాయతీలు పరిష్కారం చూపలేకపోయాయి. ఇరవైరోజుల పసికందును భుజాన వేసుకొని, మరో బిడ్డను చంకలో ఎత్తుకుని కట్టుబట్టలతో బయటికొచ్చింది. ‘ఎలా బతకాలి?’ అని ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఎలాగోలా బతకాల్సిందే. కన్నబిడ్డల కడుపు నింపాల్సిందే. ధైర్యంగా కుటుంబ వృత్తిని ఎంచుకుంది. సొంతంగా ఓ తెప్ప తయారు చేసుకుంది. అప్పటి నుంచీ చేపలు పట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది. ఎవరి సాయమూ లేకుండానే చెరువులోకి వెళ్తుంది. సొంతంగా చేపలు పడుతుంది. ఆ సంపాదనతో పిల్లల్ని చదివిస్తున్నది. మొదట్లో నీళ్లను చూస్తే భయమేసేది. ‘పాపం! అమాయకపు నీళ్లు. మనుషులంత కలుషితం కాలేదింకా’ అని తనకు తాను సర్దిచెప్పుకొంది. చిన్నచిన్న కష్టాలకే ఆత్మహత్యలకు తెగబడేవారికి ఈ మహిళ ఆత్మవిశ్వాస పాఠం.
‘సౌజన్యా సౌజన్యా.. నాకే ఎందుకు వలేస్తవ్?’అని ఏ చేపా ఇప్పటివరకూ అడగలేదు. అడిగినా, ఆమె దగ్గర జవాబు ఉంది. ‘బతకడానికి..పిల్లల్ని బతికించుకోవడానికి!’
… దండెంపల్లి శ్రీనివాస్