శ్రావణ మాసం విశిష్టమైంది. వరుస వ్రతాలు ఈ నెలను ఆధ్యాత్మిక నెలవుగా మార్చేస్తాయి. జాబిలికీ, వెన్నెలకీ పుట్టిన పున్నమి వేళ.. ఇలపై పండుగల హేల సంతరించుకుంటుంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగాల రక్షాబంధన్, వర్షాతిరేకాల మధ్య కర్షకులు చేసుకునే ‘కజరి పౌర్ణమి’, మలయసీమలో కొత్త సంవత్సర శోభ.. ఇలా రకరకాల పర్వదినాల సమాహారం శ్రావణ పౌర్ణమి. ఆ పండుగల విశేషాలివి..
రాష్ర్టానికో పున్నమి
వివిధ రాష్ర్టాలలో శ్రావణ పౌర్ణమిని విభిన్నంగా జరుపుకొంటారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో ‘నారియల్ పౌర్ణమి’గా చేసుకుంటారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ర్టాల్లో ‘కజరి పౌర్ణమి’గా పిలుస్తారు. ఒడిశాలో రాఖీ పండుగను ‘గహ్మ పూర్ణిమ’ అంటారు. శ్రావణ పున్నమినాడు ఆవులు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, మనసారా అలంకరణలు చేస్తారు. రక్ష కడుతారు. పాడిపంటలు సమృద్ధిగా ఇవ్వమని కోరుతారు.
గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో ‘పవిత్రోపన’ పేరుతో ఈ రోజు శివునికి పూజ చేస్తారు. ఉత్తరాఖండ్ ప్రజలు ‘జనోపున్యు’ పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు.
ద్రౌపదికి కృష్ణ రక్ష
ఇతిహాసాల ప్రకారం చూస్తే.. ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం అత్యంత గొప్పగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన చీరకొంగును చింపి కిట్టయ్య వేలుకు కట్టు కడుతుంది. ద్రౌపది చూపిన సోదర ప్రేమకు ముగ్ధుడైన కృష్ణుడు ఆపత్కాలంలో అండగా ఉంటానని అభయంఇస్తాడు. ద్రౌపది కట్టిన చింకిపేగును నల్లనయ్య రక్షాబంధనంగా భావించాడు.
పుడమికి.. కడలికి.. వెన్నెల హారతి
కురిసేదాకా ఊరించే శ్రావణ మేఘాలు కరిగాయా.. రైతన్న పంట పండినట్టే! వర్షాలు ఘనంగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని రైతులు పుడమి తల్లికి పూజలు చేస్తారు. ‘కజరి పౌర్ణమి’ సందర్భంగా భూదేవికి మొక్కి నాట్లు వేసుకుంటారు. సముద్రతీర ప్రజలు ఇంద్రుణ్ని, వరుణుడిని పూజిస్తారు. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తూ జాలర్లు తమ ప్రయాణం సజావుగా సాగేలా చూడమని, వల నిండా వెల కట్టలేనన్ని చేపలు పడేలా అనుగ్రహించాలని సముద్రుడిని కోరుకుంటారు. ఈ పౌర్ణమినే కొన్ని ప్రాంతాల్లో ‘నారియల్ పౌర్ణమి’ అని పిలుస్తారు. ఈ సందర్భంగా సముద్రంలో కొబ్బరికాయను విసిరి భక్తిని చాటుకుంటారు. ఇలా సముద్రుడికి కొబ్బరికాయ సమర్పించడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో లంకలో ఉన్న సీతను రావణుని చెర నుంచి విడిపించడానికి రాముడు వానర సమేతంగా సముద్రతీరం చేరుకుంటాడు. అప్పుడు జలధిని దాటడానికి వానరులు రాళ్లను సముద్రంలోకి విసిరి వారధి నిర్మిస్తారు. దాని మీదుగా లంకకు చేరుకున్న రాముడు సీతను రక్షించాడన్న కథను చెబుతూ కొబ్బరి
కాయను సముద్రంలోకి విసురుతారు. అంతేకాదు, కొబ్బరికాయను మూడు కన్నులుగల శివునిగానూ
భావిస్తారు.
ఇంద్రునికి బాసట
పురాణాల కాలం నుంచీ రక్ష కట్టే సంప్రదాయం ఉందని పలు కథల ద్వారా తెలుస్తున్నది. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం జరిగింది. అందులో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారంతో అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన శచీదేవి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని దేవేంద్రుడిని యుద్ధానికి సన్నద్ధుడిని చేస్తుంది. పార్వతీపరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి తన భర్తకు విజయం కలగాలని కోరుతూ మంత్రించిన కంకణ దారాన్ని ఇంద్రుడి చేతికి కడుతుంది. దేవతలందరూ రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపుతారు. యుద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ఇంద్రుడికి రక్ష కట్టింది శ్రావణ పౌర్ణమినాడే! అలా మొదలైన రక్షాబంధనం నేడు రాఖీపండుగ ఆచారమైంది.
చారిత్రక రాఖీ
రాఖీ పౌర్ణమితో చారిత్రక గాథలూ పెనవేసుకొని ఉన్నాయి. గ్రీకు రాజు అలెగ్జాండర్ భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. ఇక్కడే రుక్సానా అనే యువతిని పెండ్లి చేసుకుంటాడు. భారత రాజు పురుషోత్తముడితో యుద్ధానికి సిద్ధమవుతాడు అలెగ్జాండర్. పురుషోత్తముని పరాక్రమం గురించి తెలిసిన రుక్సానా ఆ చక్రవర్తికి ఓ రాఖీని పంపుతుంది. తన భర్తను ఏం చేయవద్దని కోరుతుంది. యుద్ధంలో అలెగ్జాండర్ పైకి కత్తి ఎత్తిన పురుషోత్తముడు తన చేతి మణికట్టుకు ఉన్న రాఖీని చూసి అతడ్ని వదిలేస్తాడు. ఈ రాఖీ కట్టే ఆచారం మొఘలుల కాలంలో స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని కొందరంటారు. ఇలా ఎన్నో కథలు రాఖీ పండుగ గురించి ప్రచారంలో ఉన్నాయి. ఇది ఒక నమ్మకంతో, ప్రేమతో, అనుబంధంతో కూడుకున్న ఆచారం. దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతలు పెనవేసుకున్న పున్నమి పండుగ.
… బద్రి శ్రీనివాస్