జనగామ చౌరస్తా : వెలుగు దివ్వెల దీపావళి ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రతి ఇల్లు, వ్యాపార సముదాయాలు లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీ పూజలు, నోములు, వ్రతాలతో కళకళలాడాయి. తమలో ఉన్న భయం, అజ్ఞానపు చీకట్లను పారదోలి, ఆయురారోగ్యాలతో పాటు అష్ట, ఐశ్వర్యాలు సిద్ధింపజేయాలని భక్తజనం దేవతామూర్తులను కోరుకుంది. మరికొందరు 20, 50, 100, 200, 500 రూపాయల కరెన్సీ నోట్లతో లక్ష్మి సరస్వతి అమ్మవారిని తమ ఇళ్లల్లో ప్రత్యేకంగా అలంకరించుకొని దీపావళిని దేదీప్యమానంగా జరుపుకున్నారు.
పండుగ పూట ఇంట్లో తయారు చేసిన ప్రత్యేక శాఖహార వంటకాలు, స్వీట్స్తో కుంటుంబమంతా విందు చేసుకున్నారు. రాత్రిపూట చిన్న, పెద్ద తేడా లేకుండా దీపావళి టపాకాయలు, చిచ్చుబుడ్లు, లక్ష్మి బాంబులు, రాకెట్స్, క్రాకర్స్ కాల్చుతూ జనమంతా కుటుంబ సభ్యుల నడుమ సంతోషంగా గడిపారు.