హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతుండగా, తెలంగాణలో నిరుద్యోగిత రేటు తగ్గుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో వెల్లడించిన నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు, తాజాగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. 2016-2019 మధ్య కాలం లో దేశంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు 24 శాతం పెరిగినట్టు ఎన్సీఆర్బీ గణాంకాల ద్వారా వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా 2016లో నిరుద్యోగుల ఆత్మహత్యల కేసులు 2,298 నమోదు కాగా 2019లో ఈ సంఖ్య 2,8 51కి పెరిగింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ర్టాల్లో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో 2016లో 224 ఆత్మహత్యలు నమోదుకాగా 2019నాటికి 553 కు ఎగబాకింది.
మెరుగైన స్థితిలో తెలంగాణ
మరోవైపు, నిరుద్యోగిత రేటును తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించింది. సీఎంఐఈ నివేదిక ప్రకారం గత జూలై నెలలో జాతీయ నిరుద్యోగిత రేటు 7శాతం ఉండగా, తెలంగాణలో 4శాతానికి పరిమితమైంది. రాష్ట్రంలో జూన్లో 16.6 శాతంగా నమోదైన నిరుద్యోగిత ఒక్క నెలలోనే రికార్డు స్థాయికి తగ్గింది. లాక్డౌన్ మినహాయింపు ప్రకటించిన నాటినుంచి నిరుద్యోగిత క్రమంగా తగ్గుతూ వస్తున్నది. 2020 మేలో జాతీయ నిరుద్యోగిత రేటు అత్యధికంగా 14.7 శాతానికి చేరుకోగా, ఆగస్టులో 5.8 శాతానికి తగ్గింది. పలు రాష్ర్టాల్లో రెండో విడత లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మే నెలలో 7.4 శాతానికి పెరిగింది. ప్రస్తుతం స్వల్పంగా తగ్గినట్టె సీఎంఐఈ నివేదిక పేర్కొంది.
ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో నమోదైన నిరుద్యోగుల ఆత్మహత్యలు
2019లో 2,851
2018లో 2,741
2017లో 2,404
2016లో 2,298