27న రథోత్సవం, 29న ముగింపు
శ్రీరంగాపూర్, మార్చి 19 : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన రంగనాథ స్వామి ఆలయంలో నేటి నుంచి ఈ నెల 29 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం కొయిళ్వార్ తిరుమంజనం సేవతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. నిత్యం శ్రీదేవి, భూదేవీ సమేత రంగనాథ స్వామికి ఉదయం, సాయంత్రం విశేష వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో శ్రీరంగాపూర్ సేవా సమితి, గ్రామ పంచాయతీ అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఈవో సత్యచంద్రారెడ్డి కోరారు. 27న ధర్మకర్త కృష్ణదేవరావు రంగనాథ స్వామికి పట్టువస్ర్తాలు సమర్పించి రథోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరుకానున్నట్లు ఈవో తెలిపారు.
విశేష వాహన సేవలు ఇలా..
20న కొయిళ్వార్ తిరుమంజనం సేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ
21న ధ్వజారోహణం, భేరీ పూజ, దేవతాహ్వానం
22న శ్రీవారి మూల మంత్ర హవనం, సూర్యప్రభ వీధి ఉత్సవం
23న శేషవాహన తిరువీధి ఉత్సవం
24న హనుమద్వాహన సేవ, మంటపోత్సవం
25న మోహిని సేవ, గరుడ వాహన సేవ, శ్రీదేవి, భూదేవి రంగనాయక స్వామి కల్యాణోత్సవం
26న తిరువీధి సేవ, గజవాహన సేవ
27న రథోత్సవం, 28న అశ్వవాహన సేవ, పార్వేటోత్సవం
29న పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, నాగవల్లి, మూగబలి సేవలు ఉంటాయి. ఇదే రోజున ఉత్సవాలు ముగియనున్నాయి.