హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సంపూర్ణ అక్షరాస్యత సాధనలో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వెల్లడించింది. విద్యార్థులను వలంటీర్ టీచర్లుగా నియమించాలని సూచించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని యూజీసీ కార్యదర్శి రజినీశ్ జైన్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమ అమలు మార్గదర్శకాలను జారీ చేశారు. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని, ఆ దిశగా విద్యాసంస్థలు చొరవ చూపాలని రజినీశ్జైన్ సూచించారు.