గణపతి దేవుడు గద్దెనెక్కిన తర్వాత ఆయన ముందున్న సవాలు తీరాంధ్రానికి రుద్రదేవుడు వేసిన మార్గాన్ని మరింత సుస్థిరం చేయడం. అప్పుడే కాకతీయ రాజ్యం సామ్రాజ్యంగా మారుతుంది. గణపతి దేవుడి బలం, బలగం అంతా బావలూ, బావ మరుదులూ, సామంత నాయకులే. సామంతుడైన రేచర్ల రుద్రుడు గణపతిని సింహాసనం మీద కూర్చోబెడితే, చెల్లెళ్ళ భర్తల వంశమైన నతవాడి నాయకులు, మరో సామంతులైన మల్యాల నాయకులు రాజ్యాన్ని విస్తరించడానికి ముందుండి యుద్ధాలు చేసారు.
ఏనుగులకు శిక్షణ ఇవ్వడంలో దిట్ట అయిన జాయప సేనాని.. నాట్యం, నాట్యానికి సంబంధించిన కళారూపాల్లో కూడా ప్రవీణుడే. కాకతీయ చరిత్రలో రామప్పగుడికి ఉన్న శాశ్వతత్వమే కళాకారుడైన జాయప సేనానికీ ఉంది. మధ్యయుగాల్లో రాసిన నృత్య, సంగీత గ్రంథాల్లో కాకతీయ కాలపు కళను అజరామరం చేసిన వాడు జాయప.
బెజవాడ లోని క్రీ.శ. 1201 నాటి నతవాడి రుద్రుడి (గణపతి దేవుడి బావమరిది) శాసనం తీరాంధ్రలో కాకతీయ రాజ్యం బలపడుతున్న సంగతిని చెపుతుంది. ధరణికోట అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతం. రుద్రదేవుడి కాలంలోనే కాకతీయుల విధేయులైన కోట రాజులు గణపతి దేవుడికి కూడా మాండలికులుగా ఉన్నారు. ఈ కోట రాజులలో ఒకడైన బేతయకు గణపతి దేవుడి బిడ్డ గణపాంబను ఇచ్చి పెళ్లి చేయడం కూడా ఒక ముఖ్యమైన విషయం. క్రీ.శ.1219లో గణపాంబ జారీ చేసిన శాసనంలో శ్రీమన్మహా మండలేశ్వర కోట గణపమ దేవి అమ్మగారు తన పురుషుండు బేతరాజునకు పుణ్యలోక ప్రాప్తిగాను అని ఉంది. అంటే క్రీ.శ. 1219 నాటికి చనిపోయిన తన భర్త పుణ్య గతుల కోసం గయలో ’గయాశ్రాద్ధం’ అనే కర్మకాండ కోసం మొగులుట్ల గ్రామాన్ని దానం చేసింది. మళ్ళీ క్రీ.శ. 1250లో కూడా ఆమె వేయించిన శాసనం యనమదల (గుంటూరు జిల్లా) లో దొరకడం అంటే ఆమె కోట ప్రాంతంలో బలమైన రాణి వాసపు స్త్రీగా ఉంది.
యుద్ధాల్లో తలలే బంతులు
కొన్ని బిరుదులు నాటి సమాజం మనోస్థితిని తెలుపుతాయి. పృథ్వీశ్వర శిరః కందుక క్రీడా వినోద అనే బిరుదు అర్థం పృథ్వీశ్వరుడి తల అనే బంతితో ఆడుకున్న వాడని అర్థం. కాకతీయుల దాడికి భయపడ్డ వెలనాటి రాజు పృథ్వీశ్వరుడు చందవోలు విడిచి పిఠాపురానికి వెళ్లి పాలించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. వెలనాడు అంటే కృష్ణా పెన్నా నదుల మధ్య ఉన్న ప్రాంతం. క్రీ.శ. 1206 నాటికి పృథ్వీశ్వరుడిని కాకతీయ సేనలు యుద్ధంలో చంపి ఉండాలి. అందుకే గణపతి దేవుడితో పాటు ఇంకొంతమంది కాకతీయ మాండలికులు కూడా ఇదే బిరుదాన్ని పెట్టుకున్నారు. వెలనాడును కాకతీయ సామ్రాజ్యంలో భాగం చేయడానికి సహాయం చేసిన వాళ్లలో ముఖ్యులు నెల్లూరును పాలిస్తున్న చోడ రాజు తిక్క భూపాలుడు, కమ్మనాడు మహామండలేశ్వరుడైన బల్లయ్య.
ద్వీపాన్ని పట్టిన మల్యాల చౌమ్డ
ప్రాంతం చిన్నదైనా గెలుచుకున్నందుకు అపార సంపదను దాంతో పాటే ఒక గొప్ప యోధుడు, కళాకారుడు అయిన జాయప సేనానిని గణపతికి ఇచ్చింది దివి ద్వీపం. వెలనాటి రాజ్యంలో పృథ్వీపతికి సామంతుడిగా సముద్ర తీరంలో కృష్ణ ముఖద్వారం దగ్గరున్న ద్వీపం (దివి) పాలకుడు అయ్య వంశస్థుడైన పిన్నచోడ. పృథ్వీపతి పతనం తరవాత ఎదిరించి చివరికి కాకతీయ రాజ్యంలో భాగమైంది దివి. అయితే ఈ శ్రేయస్సు దక్కేది మల్యాల చౌమ్డ అనే కాకతీయ నాయకుడికి. కాకతీయుల విజయాల్లో మల్యాల నాయకులది కూడా ముఖ్య పాత్రే. వరంగల్ జిల్లా కొండపర్తిలో క్రీ.శ. 1203, 1241 నాటి శాసనాలు మల్యాల వంశ నాయకుల కథ చెపుతాయి. క్రీ.శ. 1203 శాసనంలో మల్యాల చౌమ్డ విజయాలు తెలుస్తాయి. ద్వీపాన్ని గెలుచుకోవడంలో ఈయన పాత్ర వల్ల ఈయనకు ‘దివి చూరకార’, ‘దివి లుంటాక’ అనే బిరుదులున్నాయి. యుద్ధాల్లో ఓడిన రాజ్యాల ఖజానాల్ని దోచి గణపతి దేవుడి కోశాన్ని వజ్ర వైఢూర్యాలతో నింపినవాడు మల్యాల చౌమ్డ. కృష్ణా డెల్టా కావడం వల్ల వ్యవసాయం, సముద్ర తీరం కావడం వాళ్ళ వాణిజ్యం దివికి సంపదను ఇచ్చినాయి.
దివిలో దొరికిన వజ్రం జాయపుడు
దివిని పాలిస్తున్న పిన్న చోడను ఓడించినప్పటికీ ఆయననే గణపతి తన సామంతుడిగా నిలపడం, తీరంలో మిత్రుల సంఖ్యను పెంచుకోవడం కోసమే. అంతే కాదు దివి యువరాజైన జాయపుడిని తన అధికార వర్గంలో భాగం చేసాడు. దివి రాకుమార్తెలైన నారాంబ, పేరాంబలను పెళ్లి చేసుకున్నాడు. యాదవ రాకుమార్తె సోమల దేవిని పెళ్ళాడటం ద్వారా మొదలైన గణపతిదేవుడి రాజనీతి దివిలో కూడా కొనసాగింది. బాల్యానికి, యవ్వనానికీ మధ్యలో ఉన్న జాయ (జాయప)కు గుండామాత్యుడితో శిక్షణనిప్పించి గజ సాధనిక (ఏనుగుల దళానికి అధిపతి)గా, తర్వాత వెలనాడు పాలకుడిగా, ఓరుగల్లులో మంత్రిగా నియమించాడు గణపతి దేవుడు. ఎన్ని పదవులు చేపట్టినా జాయప సేనాని గానే చరిత్రలో నిలిచాడు. ఏనుగులకు శిక్షణ ఇవ్వడంలో దిట్ట అయిన జాయప సేనాని.. నాట్యం, నాట్యానికి సంబంధించిన కళారూపాల్లో కూడా ప్రవీణుడే.
కాకతీయ చరిత్రలో రామప్పగుడికి ఉన్న శాశ్వతత్వమే కళాకారుడైన జాయప సేనానికీ ఉంది. మధ్యయుగాల్లో రాసిన నృత్య, సంగీత గ్రంథాల్లో కాకతీయ కాలపు కళను అజరామరం చేసిన వాడు జాయప. ఈయన నృత్త రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి అనే సంస్కృత గ్రంథాలు రాసినట్టు తెలుస్తున్నది. అయితే వీటిలో నృత్త రత్నావళి మాత్రమే మనకు దొరికింది, మిగతా రెండూ అలభ్యం. క్రీ.శ.1213 లో కట్టిన రామప్ప ఆలయంలోని ఎన్నో శిల్పాల భంగిమలు జాయప నృత్తరత్నావళి అంశాలతో సరిపోలుతాయి. ఎందుకంటే జాయప సేనాని గ్రంథం, రామప్ప శిల్పం రెండూ ఆ కాలంలో ఉన్న మార్గ, దేశీ నృత్య రీతుల సమాహారమే. నాటి నాట్య రూపాలైన పేరిణి, ప్రేంఖణ, శుద్ధ నర్తన, రాసక, దండ రాసక, కందుక, చిందు, భండిక, గొండలి, కోలాటం వంటి రూపాలన్నిటినీ పొందుపరిచిన పుస్తకమే నృత్త రత్నావళి.
మన కాలపు జాయప
జాయప సేనానిని మనకు అందించిన వారు డాక్టర్ నటరాజ రామకృష్ణ. నృత్త రత్నావళిలోని అంశాల ఆధారంగా ఈయన తీర్చిన కొత్త నృత్య రీతి ఆంధ్రనాట్యం. మాయమై పోయిన పేరిణి శివ తాండవం అనే నృత్య ప్రక్రియకు మళ్ళీ ప్రాణం పోసి వందల మందిని పేరిణి కళాకారులుగా తీర్చిదిద్దారు నటరాజ రామకృష్ణ. 2011లో చనిపోయిన ఆయన సమాధి కుతుబ్ షాహీ కాలపు నాట్యకళాకారిణి తారామతి నివాసమైన తారామతి బారాదరి పక్కన ఉంది. సమాధిలో సైతం కాకతీయ జాయప సేనానికీ, కుతుబ్ షాహీ తారామతి నృత్య రీతికీ డాక్టర్ నటరాజ రామకృష్ణ వారధిగా ఉన్నారనిపిస్తుంది. ఇదే తెలంగాణలో ప్రవహిస్తున్న మిశ్రమ సంస్కృతి.
డాక్టర్ ఎం.ఎ. శ్రీనివాసన్
-81069 35000