పంజాబ్, బెంగాల్ మహరాష్ర్టల్లో తీవ్రమైన అణచివేతకు గురైన సాయుధ బృందాలన్నీ త్రివేణీ సంగమంలా ఉత్తర ప్రదేశ్ను చేరుకున్నాయి. విద్యార్థి యువతను మేల్కొలిపి, సాయుధ పోరును నడిపించాయి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ సైనికులై సాగిన నవయవ్వన సాయుధులు సాగించిన పోరాటం ‘కాకోరీ కుట్రకేసు’తో చరమదశకు చేరుకున్నది. భరతమాత ముద్దుబిడ్డలు ఉరికంబం ఎక్కి స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన విప్లవ స్ఫూర్తి జాతీయోద్యమాన్ని ముందుకు నడిపించింది.
1925 ఆగస్టు 9..
లక్నో వెళ్లే ప్యాసింజర్ రైలు సహారన్పూర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఆ రైలు కాకోరీ దాటి ఆలంనగర్ స్టేషన్ సమీపానికి చేరుకున్నది. రెండో తరగతిలో ప్రయాణిస్తున్న అష్ఫాకుల్లా అలారం గొలుసు లాగాడు. రైలు ఆగింది. అష్ఫాకుల్లాతోపాటే రైలెక్కిన మిత్రులంతా రైలు దిగారు. గార్డుబ్రేకు దగ్గరకుపోయి పిస్తోళ్లు చూపిస్తూ గార్డుని బయటికి లాగారు. రైల్వే పోలీసులు చేతులెత్తేశారు. రైలుకు అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు నిలుచుని గాలిలోకి పిస్తోళ్లను పేలుస్తుంటే.. మిగతావాళ్లు రైలులో ఉన్న నగదు పెట్టెను బయట పడేశారు. ఇంతలో డెహ్రాడూన్ మెయిల్ దగ్గరకు వచ్చింది. అది వెళ్లిపోయేంతవరకు శాంతించారు. అనంతరం అష్ఫాకుల్లాఖాన్ సుత్తితో పెట్టెను బద్దలుకొట్టాడు. డబ్బుని సంచుల్లో నింపుకున్నారు. ముందుగా అనుకున్నట్టే లక్నోలోని విక్టోరియా పార్క్ చేరుకున్నారు. ఈ దోపిడీలో మొత్తం రూ. 3,514 నగదు, మరికొన్ని రశీదులు ఎత్తుకుపోయారు.
రహస్యం తెలిసిపోయాక..
1924 అక్టోబరు 16న హౌరా వద్ద విప్లవకారుడు యోగీశ్చంద్ర ఛటర్జీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి కొన్ని లేఖలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా విప్లవకారుల పేర్లు పోలీసులకు తెలిసిపోయాయి. వారిపై నిఘాపెట్టారు. సెప్టెంబరు 20న రాంప్రసాద్ బిస్మిల్తోపాటు పది మందిని అరెస్ట్ చేశారు. ఇందుభూషణ్ మిత్ర, బనారసీలాల్ అప్రూవర్గా మారిపోయారు. (తర్వాత బనారసీలాల్ కోర్టులో పోలీసులకు ఎదురుతిరిగాడు.)
రైలు దోపిడీకి పాల్పడ్డారని 21 మందిపై కేసు పెట్టి 1925 సెప్టెంబర్ 26న డిప్యూటీ మెజిస్ట్రేట్ సయ్యద్ ఐనుద్దీన్ ఎదుట నిందితులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాలంలో ఈ కేసు ‘కాకోరీ కుట్రకేసు’గా ప్రసిద్ధిగాంచింది. నిందితుల తరపున ప్రఖ్యాత న్యాయవాది పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ వాదించారు. స్పెషల్ సెషన్స్ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ 1928 మే 3వ తేదీ నుంచి 1927 ఫిబ్రవరి 12 వరకు విరామం లేకుండా 18 నెలలపాటు సాగింది. ఆ విచారణ వార్తలు అప్పట్లో ఓ పెద్ద సంచలనం! 1927 ఏప్రిల్ 7న ఈ కేసు విచారణ ముగిసింది. రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్రనాథ్ లహరీ, అష్ఫాకుల్లాఖాన్, రోషన్ సింగ్లకు ఉరిశిక్ష, కొందరికి యావజ్జీవ దేశాంతరవాస శిక్ష, మరికొందరికి పదేళ్ల కఠినశిక్షను విధించారు. ప్రధాన ముద్దాయిల్లో ఒకడైన చంద్రశేఖర్ అజాద్ పోలీసులకు దొరకలేదు
హిందూముస్లిం సోదరులం!
అష్ఫాకుల్లాఖాన్ను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు పోలీస్ అధికారి ఖాన్ బహద్దూర్ హుస్సేన్, మేజిస్ట్రేట్ సయ్యద్ ఐనుద్దీన్ ఆయనను ఇలా అడిగారు. ‘రాంప్రసాద్ బిస్మిల్ హిందువు. హిందూరాజ్యం స్థాపించేందుకు అతను కృషి చేస్తున్నాడు. నీ మతానికి, నీ మతంవారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా అతనితో చేతులు కలపడం దేనికీ?’ అంటూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు.
అప్పుడు అష్ఫాకుల్లాఖాన్ ఇలా సమాధానం చెప్పాడు! ‘నా దృష్టిలో రాంప్రసాద్ బిస్మిల్ హిందువు కాదు. అతడు హిందూస్థానీయుడు. అతని ఆశయం హిందూ స్వాతం త్య్రం కాదు. హిందూస్థానీ స్వాతంత్య్రం. ఒకవేళ అతను హిందూ రాజ్యం కొరకు ప్రయత్నించినా, అతనితో చేతులు కలిపేవాడినే. ఎందుకంటే బ్రిటిష్ వారికంటే హిందువులు నయం కదా? హిందువులు మన దేశస్థులే కదా? కొందరు మెచ్చుకుంటారని, మరికొందరు విమర్శిస్తారని నాకు తెలుసు. కానీ, నిజమైన విప్లవకారునిగా నేను వాటిని లెక్కచేయను. నేను మరణించే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. మన దేశంలోని అన్ని మతాల వారికీ బ్రిటిష్ వాళ్లే శత్రువులు. కాబట్టి ఈ నిరంకుశత్వాన్ని పూడ్చిపెట్టడం ప్రతి భారతీయుడి నైతిక బాధ్యత. భారత స్వాతంత్య్ర బలిపీఠంపై ప్రాణాలర్పిస్తున్న భారతీయ ముస్లింను అయినందుకు గర్వపడుతున్నా’ అన్నాడు.
అష్ఫాకుల్లా కవి కూడా.. తనను ఉరితీసేందుకు కొన్నినిమిషాల ముందు ఉర్దూ కవితను చదివాడు. ‘నిరంకుశత్వాన్ని, అన్యాయాన్ని సహించలేక ఫైజాబాద్ జైలు నుంచి మృత్యుభూమికి పయనిస్తున్నాను.’ అని దాని అర్థం. ఆ కవిత పూర్తయిన వెంటనే ఖురాన్ చేతపట్టుకుని ఉరికంబమెక్కాడు. అన్నదమ్ముల్లా తనతో కలిసి ఒకే కంచంలో భుజించిన రాంప్రసాద్ని విడిచి అష్ఫాకుల్లాఖాన్ వెళ్లిపోయాడు.
గర్వించిన వీరమాత
‘బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి. వందేమాతరం… భారత మాతకు జై’ అని నినదిస్తూ గోరఖ్పూర్ జైలులో 1927 డిసెంబరు 19న రాంప్రసాద్ బిస్మిల్ ఉరికంబమెక్కాడు. ఈ వార్త విని, ఆయన తల్లి ఇలా అన్నదట. ‘మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన నా కొడుకు త్యాగనిరతికి నేను గర్వపడుతున్నాను. నా కుమారునిపై నా కంటే దేశమాతకే ఎక్కువ అధికారం ఉంది. అతని మరణంపట్ల నేను విచారించడం లేదు’ అన్నది ఆ వీరమాత.