హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4.64 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరిలో 3.76 శాతం, అత్యల్పంగా గద్వాల జిల్లాలో 1.45 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. నారాయణపేటలో 8.88 శాతం, కామారెడ్డిలో 8.32 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది.
99 లక్షల ఇండ్లలో ఫీవర్ సర్వే పూర్తి చేశామని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు. ఫీవర్ సర్వేలో భాగంగా 4.32 లక్షల మందికి మెడికల్ కిట్లు అందించామని తెలిపారు. పిల్లల చికిత్సకు ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశామని చెప్పారు. రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.
మేడారం జాతరలో కొవిడ్ నిబంధనల అమలుకు ప్రభుత్యం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కరోనా పరీక్షలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు సిద్ధం చేశామన్నారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతోనే పాఠశాలలు తెరిచామని తెలిపారు. కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ నివేదిక ఇచ్చిందని కోర్టుకు శ్రీనివాస్ రావు విన్నవించారు. కరోనా పరిస్థితులపై విచారణను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.