కరీంనగర్ తెలంగాణచౌక్, ఆగస్టు 26 : ఏటా శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండుగకు అక్కాచెల్లెలు రాఖీ కట్టడానికి వస్తారని అన్నాదమ్ములు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పండుగను మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం దూరంచేస్తున్నది. ఈ నెల 28 రాఖీపౌర్ణమి రోజున కూడా విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు అన్ని డిపోలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.
పండుగ ముందు రోజు, పండుగ రోజు 36 గంటలు డబుల్ డ్యూటీ (డీడీ) నిర్వహించాల్సిందేనని ఆదేశించారు. ఏదైనా కారణంతో విధులకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ రోజు విధులకు హాజరుకావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ డ్యూటీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆర్టీసీ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. పండుగ రోజు మహిళా ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు.