హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ/బంజారాహిల్స్: వాతావరణ పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసినట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆయన ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో బుధవారం జరుగాల్సిన ఈసెట్ ఇప్పటికే వాయిదా వేశారు. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
భారీ వర్షాల వల్ల విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 నుంచి 16 వరకు సెలవులు పొడిగించడంతో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 16న నిర్వహించే బీటెక్/బీఫార్మసీ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలతోపాటు థర్డ్ ఇయర్ సెకండ్ మిడ్టర్మ్ పరీక్షలను వాయిదా వేసినట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 21 నుంచి జరుగాల్సిన పరీక్షలకు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
సెలవుల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి నుంచి 16 వరకు జరుగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశామని ఓయూ పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు త్వరలోనే రీషెడ్యూల్ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి జరుగాల్సిన పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సిన పోస్టు గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్టు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అధికారులు బుధవారం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాల వల్ల పరీక్షలను వాయిదా వేసినట్టు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పరాంకుశం తెలిపారు.