హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బీటెక్లో ఆనర్స్, మైనర్ డిగ్రీల పేరుతో ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) కీలక నిర్ణయం తీసుకున్నది. సీటు వచ్చిన బ్రాంచిలో మేజర్ డిగ్రీతోపాటు నచ్చిన మరో కోర్సులో మైనర్ డిగ్రీని చదివే అవకాశం కల్పించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే యూనివర్సిటీ పరిధిలో డ్యూయల్ డిగ్రీ విధానాన్ని అమలుచేయనున్నట్టు ప్రకటించింది. ప్రధాన డిగ్రీని బీటెక్ ఆనర్స్గా, అదనపు డిగ్రీని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఐఐటీలలో అమల్లో ఉన్న ఈ డ్యూయల్ డిగ్రీ విధానాన్ని అధ్యయనం చేసిన జేఎన్టీయూ అధికారులు.. వర్సిటీ పరిధిలో అనుమతిచ్చారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సైతం గతంలో డ్యూయల్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా విద్యార్థులు కొన్నింటిపై సమగ్ర పరిజ్ఞానం, మరికొన్నింటిపై కొంత మేర విషయ పరిజ్ఞానం నేర్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానంలో విద్యార్థి తాను చదువుతున్న బ్రాంచియే కాకుండా మరో డిపార్ట్మెంట్లోని నచ్చిన కోర్సులో చేరవచ్చు. ఇలా ఆనర్స్ డిగ్రీకి తోడుగా 18- 20 క్రెడిట్లను మైనర్ డిగ్రీ ద్వారా పొందవచ్చు.