కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్న సిరిసిల్ల(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు తర్వాత కళకళలాడుతూ, అలుపెరగక తిరుగుతూ కనిపించిన సిరిసిల్ల మరమగ్గాలు కళావిహీనమయ్యాయి. పని కరువై బూజుపట్టిపోతున్నాయి. పట్టణంలో గడగడపన వినిపించే మగ్గం చప్పుడు ఇప్పుడు చెవులు రిక్కించినా వినిపించడం లేదు. 30 వేల మరమగ్గాలు మూగబోవడంతో వాటినే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న 20 వేలమంది కార్మికుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇవ్వాల్సిన రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఆర్డర్లపై స్పష్టత లేకపోవడం, బతుకమ్మ చీరలకు సంబంధించి రూ. 200 కోట్ల బిల్లులు విడుదల చేయకపోవడంతోపాటు బతుకమ్మ చీరల కొత్త ఆర్డర్లపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ లేకపోవడం నేతన్నలను కలవరపాటుకు గురిచేస్తున్నది. వీటన్నింటికీ తోడు దాదాపు రూ.100 కోట్ల విలువైన పాలిస్టర్ వస్త్ర నిల్వలు పేరుకుపోవడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది.
కేసీఆర్ హయాంలో గడిచిన పదేండ్ల కాలంలో అభివృద్ధి పథాన సాగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం మారిన తర్వాత పలు అంశాలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. సంక్రాంతి పండుగ నుంచే పట్టణంలో సాంచాల సప్పుళ్లు బందయ్యాయి. ఆర్వీఎం యూనిఫాంల ఆర్డర్లు, బతుకమ్మ చీరలు వంటి ఆర్డర్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంద్కు పిలుపునిస్తున్నట్టు పాలిస్టర్ అసోసియేషన్ వెల్లడించింది. వినాయక చవితి, దసరా వంటి పండుగలు, శుభకార్యాల సమయంలో అలంకరణ కోసం వినియోగించే పాలిస్టర్ వస్ర్తాల తయారీకి సిరిసిల్ల పెట్టింది పేరు. ఇక్కడ తయారయ్యే పాలిస్టర్ వస్ర్తాలు చత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా పది రాష్ర్టాలకు ఎగమతి అవుతాయి. ప్రస్తుతం ఈ వస్ర్తాలకు డిమాండ్ తగ్గడంతో దాదాపు రూ.100 కోట్ల విలువైన వస్ర్తాలు పేరుకుపోయాయి.
వస్త్ర పరిశ్రమను ఆదుకొనే లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 2016 నుంచి ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) కింద దుస్తుల తయారీ కోసం ఆర్డర్లు ఇస్తూ వచ్చింది. ఏటా రూ. 110 కోట్ల విలువైన ఆర్డర్లు ఇస్తూ నేతన్నల సంక్షేమానికి చర్యలు తీసుకున్నది. టెక్స్టైల్ పార్క్లో ఇటీవల మరమగ్గాలను నిలిపివేయడంతో ప్రభుత్వం స్పందించి రూ. 70 కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అదే సమయంలో సిరిసిల్లలోని పవర్లూంలను ప్రభుత్వం విస్మరించింది. దీనికితోడు ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం ఇచ్చే దాదాపు రూ. 350 కోట్ల విలువైన ఆర్డర్లపైనా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సిరిసిల్లలో తాజా బంద్కు ఇది కూడా ఒక కారణం. బతుకమ్మ ఆర్డర్లకు సంబంధించి కార్మికులకు ప్రభుత్వం రూ. 200 కోట్ల బకాయి పడింది. సరిగ్గా చెల్లింపులు జరిపే సమయంలోనే ఎన్నికలు రావడంతో పేమెంట్ నిలిచిపోయింది. కష్టాలన్నీ అన్నివైపుల నుంచి ఒక్కసారే చుట్టుముట్టడంతో కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని యజమానులు వాపోతున్నారు. చేసేది లేక మరమగ్గాలు మూసేయడంతో వాటినే నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్న దాదాపు 20 వేలమంది కార్మికులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పాలిస్టర్ వస్ర్తాలకు మార్కెట్లో డిమాండ్ తగ్గింది. ఉన్న వస్ర్తాలను అమ్మి కార్మికులకు ఉపాధి కల్పిద్దామంటే మీటరుకు రూపాయి నష్టం వస్తున్నది. ఇప్పుడు రూ. 100 కోట్ల విలువైన వస్ర్తాలు నిల్వ ఉన్నాయి. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి రూ.250 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. వాటి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. కొత్త ఆర్డర్లపై స్పష్టత ఇవ్వడం లేదు. తప్పని పరిస్థితిలో పరిశ్రమ బంద్ పెట్టినం.
– మంచె శ్రీనివాస్, వస్త్ర ఉత్పత్తిదారు, మున్సిపల్ వైస్ చైర్మన్, సిరిసిల్ల
ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం, ఆర్వీఎం ఆర్డర్లపై నివేదికలు తయారుచేస్తున్నాం. విషయాన్ని చేనేత సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, చేనేత జౌళిశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాల ప్రకారం సమగ్రంగా నివేదికలు రూపొందించి పంపిస్తాం. వారం రోజుల్లో ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆందోళన అవసరం లేదు.
– మిట్టకోల సాగర్, చేనేత జౌళిశాఖ జిల్లా అధికారి, రాజన్న సిరిసిల్ల