హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పౌర సరఫరాల సంస్థ వద్ద భారీగా ధాన్యం నిల్వలు ఉన్నందున త్వరగా మిల్లింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రుల కమిటీ సూచించింది. ప్రస్తుతం ఉన్న నిల్వలను తగ్గించుకోవడం, వచ్చే వానకాలం సీజన్లో ధాన్యం నిల్వలకు అవసరమైన స్థలాన్ని అందుబాటులో ఉంచుకోవడంపై ఈ కమిటీ శుక్రవారం బీఆర్కేభవన్లో సమావేశమైంది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ ఈ సమావేశంలో పాల్గొని ఆయా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ వద్ద నిల్వ ఉన్న 92లక్షల టన్నుల ధాన్యాన్ని అత్యంత వేగంగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించాలని, వచ్చే వానకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని వేగం గా తరలించాలని వారు నిర్ణయించారు. చిన్నచిన్న కారణాలతో బియ్యాన్ని తిరసరించకుండా ఎఫ్సీఐతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ అనిల్కుమార్కు సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలనేదానిపైనా చర్చించారు. దీనిపై సోమవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.