హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు టీకాతో సమానమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత గంటలోపు కచ్చితంగా తల్లిపాలు తాగించాలని సూచించారు. హైదరాబాద్లోని పేట్లబుర్జు ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల్లో మంత్రి హరీశ్రావు శుక్రవారం పాల్గొన్నారు. దవాఖానలో ఏర్పాటు చేసిన ‘మదర్ మిల్ బ్యాంక్’ను (తల్లిపాల నిల్వ కేంద్రం) ప్రారంభించారు. దవాఖాన మొత్తం కలియదిరిగి, సదుపాయాలను పరిశీలించారు. శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి వ్రతం సందర్భంగా గర్భిణులకు, బాలింతలకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి చేతులమీదుగా వాయినం ఇప్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు అమృతంతో సమానమని, ముర్రుపాలు టీకాతో సమానమని, పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. మనదేశంలో సగటున 36 శాతం మంది పిల్లలు మాత్రమే పుట్టిన గంటలోపు తల్లిపాలు తాగగలుగుతున్నారని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. అనారోగ్యం కారణంగా ఎస్ఎన్సీయూ, ఎన్బీసీయూ కేంద్రాల్లో రోజుల తరబడి ఉండటం, తల్లి అనారోగ్యానికి గురికావడం వంటి సందర్భాల్లో రోజుల తరబడి పిల్లలు తల్లిపాలకు దూరమవుతున్నారని, ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడేలా ‘మదర్ మిల్క్ బ్యాంక్’లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పేట్ల బుర్జు దవాఖాన ఎంతో మెరుగయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు.
నార్మల్ డెలివరీ కోసం లక్షలు కడుతున్నారు
బాగా చదువుకున్నవారు, డబ్బున్నవారు కార్పొరేట్ దవాఖానకు వెళ్లి రూ.లక్షల ఫీజు కట్టి సాధారణ ప్రసవాలు చేయించుకొంటున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా సాధారణ ప్రసవాలు చేస్తామన్నా కొందరు వినడం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘డెలివరీ ఎప్పుడనేది డాక్లర్లు నిర్ణయం తీసుకొంటారు.. దయచేసి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు’ అని గర్భిణులకు, వారి అటెండెంట్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు గణనీయంగా పెరిగాయని తెలిపారు.
గతంలో 30 శాతం సాధారణ ప్రసవాలు ఉంటే.. ఇప్పుడు 60 శాతానికి పెరిగాయని, ఇదే సమయంలో ప్రైవేట్ దవాఖానల్లో కేవలం 20 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగిందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. మాతృ మరణాల తగ్గింపులో తమిళనాడును దాటేశామని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో లోపాలుంటే ఏ స్థాయి అధికారులను కూడా వదిలేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, పేట్ల బురుజు దవాఖాన సూపరింటెండెంట్ మాలతి తదితరులు పాల్గొన్నారు.
నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి.. నా కన్నా అందంగా ఉండాలి.. నా కన్నా ఎత్తు పెరగాలి.. మంచి భవిష్యత్తు ఉండాలి.. అని ప్రతి తల్లి కోరుకుంటుంది, కలలు కంటుంది. ఆ బిడ్డకు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించినప్పుడే, ఆరు నెలల వయసు వచ్చే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చినప్పుడే వారి కలలు సాకారం అవుతాయి. కాబట్టి తల్లిపాలే ముద్దు-డబ్బాపాలు వద్దు అనే నినాదం రావాలి
– మంత్రి హరీశ్రావు