నల్లగొండ : నేటి ఆధునిక సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న చరిత్రను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేసి..మన చరిత్ర మనం రాసుకుందాం అనే వినూత్న అంశానికి తెలంగాణ సాహిత్య అకాడమీ శ్రీకారం చుట్టింది. అకాడమీ అధ్యక్షుడు జూలూరి పల్లె ప్రాజెక్టుగా జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)ను ఎంపిక చేసి విద్యార్థులచే ఆయా గ్రామ, పట్టణ చరిత్రను రాసేలా చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్తో కలిసి ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి స్ఫూర్తిని నింపారు.
ఈ సందర్భంగా జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. చరిత్ర మూలాలను మనం రాబోయే తరాలకు ఇచ్చే సంపదని, దానిలో భాగమే మన చరిత్రను మనమే రాసుకునే అనే అంశం అన్నారు. దీంతో గుణాత్మక మైన మార్పు వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరుగుతున్న పరిణామంలో ఇది ఒక మంచి శుభసూచకంగా మారిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ దూబే 15 మంది విద్యార్థులతో 1950-51 సం.లో శామీర్ పేట లో పర్యటించి అక్కడి సామాజిక అంశాలపై రాసిన గ్రంథమే ‘ఇండియన్ విలేజ్’ (భారత గ్రామం) పుస్తకం రాశారు.
అది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుస్తకంగా నేడు ప్రాచుర్యంలో ఉందన్నారు. నేడు ఆ గ్రంథమే సామాజిక శాస్త్రాలకు గ్రామీణ ప్రాంతాలపై పరిశోధనకు నిదర్శనంగా మారిందన్నారు. బీఎన్ శాస్త్రి 1200 పేజీలతో చరిత్ర అంశాలతో ఒక పుస్తకం రాశారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో తో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మన చరిత్ర మనం రాసుకుందాం అనే అంశాన్ని ఎన్జీ కళాశాల విద్యార్థులకు అధ్యాపకులకు పరిచయం చేశామన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, డీపీఓ విష్ణువర్ధన్రెడ్డి దీనిలో కీలక భూమిక పోషించి జిల్లాలోని అన్ని గ్రామాల నైసర్గిక స్వరూపం, సామాజిక, ఆర్థిక అంశాలను అందిస్తారని ఇది కొత్త చరిత్ర రాస్తున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్ని అంశాలతో పూర్తి సమగ్ర చరిత్రను సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పుస్తక రూపంలో ప్రచురిస్తాం అన్నారు. కాగా, విద్యార్థులు సంతోషంగా ఈ సంకల్పంలో భాగస్వామ్యం అవుతామని చప్పట్లతో అంగీకరించారు.
ప్రముఖ వాగ్గేయకారుడు అంబటి వెంకన్న, డాక్టర్ సినారె అవార్డు గ్రహీత మునాస వెంకట్, ప్రపంచ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఉపాధ్యక్షుడు ఎంవీ గోనారెడ్డిలు మాట్లాడుతూ.. ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ బొల్లోజు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, రచయితలు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.