జనగామ, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ఆ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం తెలిపారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘ఇంటర్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు’ అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరిట జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఎన్ ఫంక్షన్ హాలులో ఇంటర్ తర్వాత విద్యావకాశాలపై జనగామ ఏబీవీ జూనియర్ కాలేజీ, శ్రీగాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో 500 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చదవాలి? ఎటు వైపు వెళ్తే జీవితంలో స్థిరపడి ఉత్తమ ఉద్యోగం చేయవచ్చు? అనే అంశంపై కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సహా ఏబీవీ జూనియర్ కాలేజీ, శ్రీగాయత్రి జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు కనకరాజు, శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎంపీ మల్లేశం మాట్లాడుతూ.. ఎదగాలనే సంకల్పం బలంగా ఉన్నవారిని ఎవరూ ఆపలేరని అన్నారు. విద్యార్థుల లక్ష్యానికి కేఎల్ యూనివర్సిటీ గైడ్ తోడైతే గమ్యం మరింత సులువుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలివితేటలను ఉపయోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం ఇంటర్ ఫస్టియర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇంటర్ తర్వాత ఎటువైపు? అనే అంశంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు ఏబీవీ, శ్రీగాయత్రి విద్యార్ధులు నమస్తే తెలంగాణ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ వరంగల్ బ్రాంచి మేనేజర్ పీఅశోక్ కుమార్, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ సూరి తదితరులు పాల్గొన్నారు.