నల్లగొండ ప్రతినిధి; సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/నార్కట్పల్లి : ‘మీ అందరి ఆశీస్సులు ఉంటే నేను సీఎం అవుతా.. అప్పుడు నన్ను బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’ అని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశా రు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి రాజగోపాల్రెడ్డి అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు వెల్లెంల గ్రామస్తులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ‘సీఎం.. సీఎం’ అని నినదించడంపై రాజగోపాల్రెడ్డి స్పందించారు. ‘నన్ను సీఎం అని పిలుస్తున్నారు. ఆ సమయం గనుక వస్తే దానిని ఆపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు’ అని అన్నారు.
‘నాకు ఏ పదవి వచ్చినా అది సామాన్య ప్రజలకు వచ్చినట్టే. నిస్వార్థంగా, నిజాయితీగా పేద ప్రజల కోసమే దాన్ని వినియోగిస్తా. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తరువాత ఎంపీ ఎన్నికల టైమ్లో నాకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. మంత్రి పదవి విషయంలో రాహుల్గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంట. ఏ పదవి ఇచ్చినా న్యాయం చేస్తా’నని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అవమానం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జగిత్యాల జీవన్రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత, రాజశేఖర్రెడ్డికి కూడా మంచి అభిమాని. అలాంటి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలిపోవాల్సి వచ్చిందో అందరూ ఆలోచించాలి. ఇక మరో సీనియర్ నేత చిన్నారెడ్డికి అవమానం జరుగుతుంది. ఇలాంటి పరిణామాలు పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు. కాంగ్రెస్కు మెజారిటీ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్ లాంటి వాళ్లతో మనకేం పని? ఇట్లాంటోళ్లు వచ్చి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేస్తున్నారు’ అని మండిపడ్డారు.
‘కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నేతలను తీసుకోవచ్చు. అంతమాత్రాన మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. ‘బయటి నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని కొందరు చూస్తున్నరు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టిస్తున్నరు. ఇలాంటివి రాజగోపాల్రెడ్డి చూస్తూ ఊరుకోడు. మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ఇలా ఎక్కడైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా. ఈ విషయంలో అవసరమైతే పార్టీ పెద్దలతోనూ కొట్లాడేందుకు సిద్ధం. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పదేండ్లు కొట్లాడిన. కార్యకర్తలకే పార్టీలో అవకాశాలు రావాలి. వాళ్లకు అన్యాయం జరుగనివ్వను. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం, అవినీతి అక్రమాలపై కొట్లాడటంలో ముందుంటా’నని స్పష్టం చేశారు.