హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ) : పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతం గా అభివృద్ధి చేయవచ్చని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తద్వారా కొత్త మేధో సంపత్తి, పేటెంట్లు సాధించడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి అవకాశాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు.
పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా చెన్నైలో నిర్వహించిన సమావేశంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తరరే అధ్యక్షతన జరిగిన భేటీలో చమురు సంస్థల అధికారులు, ప్రముఖ బ్యాంకుల ప్రతినిధులతో కలిసి వివిధ అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఇథనాల్ మిశ్రమం చూపుతున్న ప్రభావంపై ఐవోసీఎల్, పెట్రోలియం శాఖ అధికారులతో స్థాయీ సంఘం చర్చించింది.