సిటీబ్యూరో, జూన్ 24 ( నమస్తే తెలంగాణ) : వివాహ వేడుకలను కేవలం కుటుంబ ఆనందానికి మాత్రమే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మలిచిన గొప్ప వ్యక్తిగా నగరానికి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్ ముకిత్ చందా నిలిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ స్ఫూర్తితో అబ్దుల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద విద్యార్థులు, అనాథలు, ప్రతిభావంతుల చదువు సజావుగా సాగేలా వారికి అన్ని విధాల అండగా ఉండటానికి రూ.50 లక్షల విరాళాన్ని కేటీఆర్ సమక్షంలో అందించారు.
ఆడంబరాలు తమకు వద్దని అందుకయ్యే ఖర్చును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. నిరుపేదవిద్యార్థులకు సాయం అందించడం ద్వా రా వారి భవిష్యత్తును బలోపేతం చేయడమే తన ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సర్ సయ్యద్ సొసైటీ సహకారంతో అబ్దుల్ ముకి త్ చందా, వారి బృందం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తిస్తున్నారు. ముఖ్యం గా అనాథ విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తూ అండగా ఉంటున్నారు.
ఎంపికైన విద్యార్థుల ఒక విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజులను గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా చెల్లిస్తామని తెలిపారు. సర్ సయ్యద్ సొసైటీ విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యాసంస్థలు తమ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వడానికి అంగీకరించాయని వివరించారు. గిఫ్ట్ ఏ స్మైల్ అనే మహత్తర కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల విద్యకు అడ్డంకిగా మారకుండా చూడడమే లక్ష్యమని చెప్పారు.