హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ రైతులను మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్ రజాక్(59) పత్తి వ్యాపారి. గుజరాత్లోని కమలేశ్ పాటిల్ నుంచి బీజీ3-హెచ్టీ పత్తి విత్తనాలను కొనుగోలు చేశాడు. వాటిని మం చిర్యాల జిల్లా అచ్లాపూర్కు చెందిన మైదం శ్రీనివాస్(40), పొట్లపల్లి హరీశ్(26), సారంగపూర్కు చెందిన ముండ్రు మల్లికార్జున(30), ఐలయ్య(60) ద్వారా హైదరాబాద్ శివార్లకు తరలించాడు.
మేడ్చల్ రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని జానీ, రఫీ అనే మరో ఇద్దరితో కలిసి నకిలీ విత్తనాలను రైతులకు అమ్మేందుకు చిన్న ప్యాకెట్లుగా మారుస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 2.53 టన్నుల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేశారు. గతంలోను అబ్దుల్ రజాక్పై బాసరలో, మల్లికార్జునపై కన్నెపల్లి, మందమర్రి, రామగుండం ఠాణాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7 కేసుల్లో 7.6 టన్నుల నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్టు సీపీ తెలిపారు.