హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కొత్తగూడంలో జూన్ 4న ‘సీపీఐ ప్రజా గర్జన’ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. లక్ష మందితో నిర్వహించే సభకు జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని మగ్దూంభవన్లో ‘సీపీఐ ప్రజా గర్జన’ పోస్టర్, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో గతేడాది జూన్ 14 నుంచి మే 14 వరకు ‘బీజేపీ కో హఠావో.. దేశ్కో బచావో’ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమ ముగింపు సమావేశం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరిచామని, బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
నోట్ల రద్దు తుగ్లక్ నిర్ణయం
మోదీ రూ.2 వేల నోట్లను రద్దు చేయడం తుగ్లక్ నిర్ణయమని కూనంనేని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటికి తీసుకొస్తామని, ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని మోదీ చెప్పారని, అవన్నీ ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ సర్కారు జీవో 58, 59 ద్వారా పేదల స్థలాలను క్రమబద్ధీకరించడం, ఖమ్మంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో ఇవ్వడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నేతలు సయ్యద్ అజీజ్పాషా, చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, పశ్య పద్మ, ఎన్ బాలమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.