హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కొనుగోలుదారుల నుంచి ప్రీ లాంచ్ స్కీమ్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి, భారీ మోసానికి పాల్పడ్డ భువనతేజ ఇన్ఫ్రా ఎండీ చక్కా వెంకట సుబ్రమణ్యంను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, శామీర్పేట్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, అపార్టుమెంట్లను నిర్మిస్తానంటూ సుబ్రమణ్యం ప్రకటనలు ఇచ్చాడు. తక్కువ ధరకు ప్లాట్లు, ఫ్లాట్లు వస్తున్నాయని చాలామంది పూర్తి డబ్బులను చెల్లించారు.
కాలం గడుస్తున్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడం, అపార్టుమెంట్లు నిర్మించకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని పలువురు కోరారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, ప్లాట్లు, ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. శామీర్పేట్లో హ్యాపీ హోమ్స్ పేరిట నిర్మించిన ప్రాజెక్టులో కొనుగోలుదారుల నుంచి రూ.2.29 కోట్లు వసూలు చేసి.. ఫ్లాట్లను ఇవ్వకుండా, కనీసం డబ్బులు తిరిగి ఇవ్వకుండా దాదాపు 400 మందిని మోసం చేశాడని అందిన ఫిర్యాదుల మేరకు నిందితుడిని అరెస్టు చేశామని జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.