పెద్దమందడి: సుగంధ ద్రవ్యాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరం జన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అమ్మపల్లి గ్రామంలో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకు స్థాపన చేశారు. అదేవిధoగా వెల్టుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, జడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. సాయంత్రం చీకర్చెట్టుతండాలో నిమ్మ గడ్డి యూనిట్ ను ప్రారంభించారు.
చీకర్చెట్టుతండా, వెల్టుర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాలకు మంచి డిమాండ్ ఉందని కావున రైతులు సుగంధ ద్రవ్యాలపై దృష్టి సారించి నిమ్మగడ్డిని సాగు చేయాలని ఆయన కోరా రు. నిమ్మగడ్డిని ఒక్కసారి సాగు చేస్తే 5 సంవత్సరాల వరకు పంట వస్తూనే ఉంటుందన్నారు.
ఈ పంటకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వస్తుందని అన్నారు. కావున రైతులు నిమ్మగడ్డి సాగుపై దృష్టి సారించా లన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 770 కోట్ల మంది జనాబా ఉందని రానున్న రోజుల్లో సుగంధ ద్రవ్యాలకు మంచి డిమాండ్ ఉంటుందన్నారు. పంటలను సాగుచేసే రైతులకు డ్రిప్ ఇస్తామన్నారు.
ప్రతి రైతు తమకున్న పొలంలో కొంతమేర కూరగాయాల పంటలపై దృష్టి సారించాలన్నారు. యువ రైతులు ముఖ్యంగా ఇలాంటి వాణిజ్య పంటలపై దృష్టి సారించి మంచి దిగుబడులను పొందాలన్నారు. దేశానికి, రాష్ర్టానికి ఉపయోగపడే వాటిని చేయ్యడం గొప్ప పని అన్నారు. నిమ్మగడ్డి సాగుకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీలకు సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. జాతీయ రహాదారిపై ఉన్న వెల్టుర్ గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజురు చేసుకొని నిర్మించుకోవడం జరిగిందని, ఇక్కడి ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్య సేవలు చేస్తారని అన్నారు.
అదేవిధంగా త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో 600 పడకల దవాఖాన నిర్మాణానికి వారం పది రోజుల్లో పనులు ప్రారం భిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆగష్టు నుంచి 120 సీట్లతో మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించడం జరుగుతుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు పెద్దపీట వేస్తుందని ఫించన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ తదితర పథకాలను ఎన్నో ప్రవేశపెట్టిందన్నారు.
వ్యవసాయానికి జలకళ సంతరించుకుందని రానున్న రోజుల్లో సాగు నీటికి ఎలాంటి డోకా లేకుండా ప్రభుత్వం చూసుకుం టుందని, వెల్టుర్ గ్రామంలోని గోపాల సముద్రం చెరువు కట్ట పనులను కూడా త్వరలో చేపడతామని ఆయన చెప్పారు. వందల ఏండ్ల క్రితం నిర్మించిన ఈ చెరువు కట్ట ప్రమాదకరంగా ఉందని చెరువు కట్టను మంచిగా చేసుకుంటే ఒక రానున్న తరాలకు ఇబ్బందులు లేకుండా చేయ్యడమే మా లక్ష్యమని అన్నారు. లో ఓల్టేజీ సమస్య లేకుండా ఉండడం కోసం రెండు, మూడు గ్రామాలకు కలిపి 33/11 కేవీ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మహబూబ్నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణా రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఎంపీపీ తూడి మెగారెడ్డి, జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, డీపీవో మురళి, డీఎంహెచ్వో చందునాయక్, జడ్పీ సీఈవో వెంకట్రెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, రమేశ్, రాధాకృష్ణనాయక్, సింగిల్విండో చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సత్యారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు, మండల వైద్యాధికారి ఇస్మాయిల్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.