Children Stories |మొగులుమీది పల్లెల ముప్పై ఇండ్లు ఉంటయి. అన్ని ఇండ్లకు ఒక్కటే కిరాణ దుకునం ఉంది. ఆయినె ఆడింది ఆట.. పాడింది పాట.. శెప్పింది ధర.. ఇచ్చిందే మాలు! ఆయినెను మాట అనడానికి లేదు. అట్లని సామాను కొనకుంట ఉండలేరు. ఆని ఇకమతులు.. జోకుట్ల గోల్మాల్ అన్ని దెలిశినా.. ఒక్కటే దుకునమాయె! ఊరోల్లంత గప్చిప్గ ఉందురు. కాదంటె ఉప్పుకారం గొనాల్నన్నా అడివిలకెల్లి ఆరేడు కోసులు నడిశి పోవాలె. ఆ ఊల్లెనే రాయబోసు అనే ఒక ముసలాయినె గూడ ఉంటుండె. ఆయినెకు జెరంత కండ్లు మస్కమస్క గనిపిత్తయి గని.. సర్వం దెల్శినోడు. సర్వం జూశినోడు. రెండు మూడు బర్లున్నయి.
పాలు, పెరుగు అమ్ముకుంట ఆల్ల కుటుంబం బతుకుతాంది. దీలె పండుక్కు పోలెలు జేసుకుందామని కొత్త కోడలు పిల్ల అడిగితే.. బెల్లం దెద్దామని దుకునంకు వోయిండు రాయబోసు. రాయబోసుకు కండ్లు జరంత మస్కగ కనిపిత్తయని దుకునపాయినెకు దెలుసు. కిలో బెల్లం ఇయ్యిమంట రాయబోసు అడుగంగనే.. కండ్లు కనవడయని ముప్పావు కిలో బెల్లం జోకి, కిలో అంట ఇచ్చిండు. రాయబోసు వోతుంటే.. “తాతా! పండుక్కు ఇంట్ల నెయ్యడుగుతాండ్లు! ఓ కిలో అంత నెయ్యి వంపు” అంట జెప్పిండు. “అట్లనే!” అంట రాయబోసు ఇంటికి వోయి.. నెయ్యి జోక్కోని దెచ్చిచ్చిండు. నెయ్యి గిన్నెను కాంటకేశిన దుకునపాయినె.. “అగో! గిది ముప్పావు కిలోనే ఉంది” అనంగనే, “మా ఇంట్ల బాట్లుగీట్లు ఉంటయా బిడ్డా! నువ్విచ్చిన బెల్లానికే మా కోడలు ఎత్తుగట్టి నెయ్యిచ్చింది. బెల్లం కిలంతుంటె నెయ్యి గూడ కిలంతనే ఉంటది” అంట జెప్పిండు. తేలు గుట్టిన దొంగోలె.. నోరు మూస్కోని రాయబోసుకు పైసలిచ్చిడు దుకునపాయినె.
-పత్తిపాక మోహన్