ఉదయం పదిగంటలు. తానున్న ఓల్డేజ్ హోమ్ లైబ్రరీవైపు నడుస్తున్నాడు గోవిందం. అప్పుడే జేబులోని సెల్ఫోన్ మోగింది. ఆ సమయంలో వచ్చే ఫోన్.. అమెరికాలో ఉన్న కొడుకు దగ్గర్నుంచేనని అతనికి తెలుసు. కెనడాలో ఉన్న కూతురు మాత్రం రాత్రి సమయంలో చేస్తుంటుంది.
“ఎట్లున్నవు నాన్నా!”.. రొటీన్ వాకబు అది.
“బాగనే ఉన్నరా!”.. గోవిందానిదీ రొటీన్ జవాబు.
“భోజనం, మిగతా సౌకర్యాలు ఫరవాలేదా?”.
“ఇక్కడ ఏ సమస్యా లేదురా!”..
కొడుకు సంతృప్తి కోసం పైకి చెప్పాడే కానీ,
స్వగతంలో మాత్రం..
‘సంతోషంగా మాత్రం లేను’ అని అనుకున్నాడు.
మరో రెండు మూడు నిమిషాలపాటు సాధారణ విషయాలు మాట్లాడుకున్న తరువాత.. వారి సంభాషణ ఇతర సంగతుల వైపు మళ్లింది.
“ఊళ్లో ఇల్లును అమ్మేస్తే బాగుంటుందేమో నాన్నా”.
“అవున్రా! నేను కూడా అట్లనే అనుకుంటున్నా”.
అతనికీ ఆలోచన ఆరునెలల క్రితం ఈ ఓల్డేజ్ హోమ్లో జాయినయ్యే సమయంలోనే వచ్చింది. ఎందుకంటే పిల్లలిద్దరూ ఇండియాకు తిరిగి వచ్చే ప్రసక్తి లేదు. తన శేష జీవితమేమో ఇక ఈ ఓల్డేజ్ హోమ్లోనే తెల్లారేలా ఉంది.
“నీక్కూడా ఇష్టమైతే వచ్చే వారంలో ఓసారి ఊరికెళ్లి, నీకు తెలిసిన నలుగురైదుగురికి చెప్తే మంచిది. ఎవరో ఒకరు ముందుకొస్తారు”.
“సరే.. పోతానులే!” అని చెప్పి, సంభాషణ ముగించాడు గోవిందం. లైబ్రెరీలో ఆనాటి దినపత్రికలు తిరగేసి, బయటికి వచ్చి తన గదివైపు నడిచాడు.
‘ఆహ్లాద నిలయం’ అనే పేరున్న ఆ ఓల్డేజ్ హోమ్.. శంషాబాద్ విమానాశ్రయం వైపు, ఔటర్ రింగు రోడ్డుకు సమీపాన ఉంటుంది. పేరుకు తగ్గట్టుగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో వృద్ధులకు అవసరమైన సకల సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కొక్కరికీ నెలకు ఇరవైఐదు వేల దాకా చార్జీలు తీసుకుంటారు.
అతని రిటైర్మెంట్కంటే ముందే పిల్లల పెళ్లిళ్లు జరిగిపోయాయి. వారు అంతకుముందే విదేశాల్లో స్థిరపడిపోయారు. రిటైర్మెంట్ తరువాత ఏ చీకూచింతా లేకుండా భార్యాభర్తలు ఆనందంగా గడుపుతున్న సమయాన.. విధి చిన్నచూపు చూసింది. కరోనా మహమ్మారికి గురై, అతని భార్య మరణించింది.
ఇక అప్పటినుంచి అతనికి ఒంటరి జీవితం దుర్భరమైపోయింది. ఇన్నాళ్లూ ప్రతి చిన్న విషయానికీ భార్యపై ఆధారపడి ఉన్నాడు. వంట కూడా రాదు. వంట మనిషిని పెట్టుకున్నా.. మరోరకం ఇబ్బందులు ఎదురైనాయి. అతని పరిస్థితిని చూసి బంధుమిత్రులు ‘ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవ్వు!’ అంటూ సలహా ఇచ్చారు. పిల్లలిద్దరూ తమ ఆమోదం తెలిపారు. మెహదీపట్నంలోని అపార్ట్మెంట్ ఫ్లాట్ను అద్దెకు ఇచ్చేసి, అరవై నాలుగేళ్ల వయసులో ఈ ఓల్డేజ్ హోమ్లో చేరిపోయాడు గోవిందం.
నిజానికి అప్పటినుంచి జీవితం నిశ్చింతగా, హాయిగా ఉంది. అతనికి నలభై వేల దాకా పెన్షన్, ఫ్లాట్ అద్దె పది వేలకుపైనే వస్తుంది. డబ్బులకు ఏమాత్రం ఇబ్బంది లేదు. పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా లేవు. అలా నాలుగు నెలలపాటు ఈ ఆహ్లాద నిలయంలో రోజులు ఆహ్లాదంగానే గడచిపోయాయి. కానీ, రెండు నెలలుగా అతనిలో తనకే తెలియని ఏదో అసంతృప్తి బయల్దేరింది. జీవితం సౌకర్యంగా ఉంది. కానీ, మనసు మాత్రం సంతోషంగా లేదు. రోజులు నిస్సారంగా గడచిపోతున్నాయనే దిగులు.. లోలోపల కుంగదీస్తున్నది. ఇప్పుడతనికి ఏ సమస్యా లేకపోవడం కూడా.. ఓ సమస్యగా అనిపిస్తున్నది.
గదికి చేరుకొని ఊరిలోని చిన్ననాటి స్నేహితుడు ఆచారికి ఫోన్ చేసి, ఇల్లు అమ్మాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆచారి నుంచి వెంటనే జవాబు రాలేదు. అతను బాధ పడుతున్నట్లుగా అర్థమైంది గోవిందానికి.
“ఆచారీ.. వినిపించిందా?” తిరిగి తనే అడిగాడు.
“ఇనవడ్డదిరా! గా ఇల్లమ్మితే నువ్వింక మనూరి దిక్కు సూడనే సూడవు కద!”.. ఆచారి గొంతులో బాధ తెలుస్తూనే ఉంది.
“అవున్రా! నాక్కూడ కష్టంగానే ఉన్నది గానీ ఏం జేస్తం చెప్పు. మనం ముసలోళ్లం అయినం. మా పిల్లలు మనూరికొచ్చి ఉంటరనేది కలల్నే జరుగుతది. నా కొడుకే అమ్ముమని చెప్తున్నడు. నేను కూడ ఓల్డేజ్ హోమ్ల జాయినైన..
నీకు తెల్సుకద”.
“అవును.. నెల కిందట్నే చెప్పినవు”.
“ఇంకో ఐదారేండ్లకు నాక్కూడ శాత గాకుండైతది. అందుకే.. ఇప్పుడమ్మితెనే బాగుంటదనుకుంటున్న”.
“నీమాట కూడా నిజమేలే! వస్తే రెండుమూడు రోజులు ఉండేటట్లు రా! అట్లయితెనే సెటిలైతది. నువ్వొచ్చే ముందు జెప్తే.. ఇల్లు శుభ్రం చేయిస్త!” అన్నాడు ఆచారి.
ఇంటి అదనపు తాళం చెవి ఒకటి ఆచారి దగ్గర పెట్టి ఉంచుతాడు గోవిందం. గతంలో తనెప్పుడు ఊరికెళ్లినా.. ఆచారి ఇంట్లోనే భోంచేస్తుండేవాడు. బదులుగా ఆచారికి అవసరమైనప్పుడు స్వల్ప మొత్తంలో ధన సహాయం చేస్తుంటాడు.
“వచ్చేవారంలో ఎప్పుడైనా సరే.. నీవు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తా!”.
“కూలిమంది దొరికేది శాన కష్టంగుంది. అంతా పత్తేరనీకె, వరిచేను కోయనీకె పోతున్నరు. మంచి గుత్తలు వొస్తున్నయి. గుత్తలంటే.. కూలికంటె ఎక్కువని ఎగవడుతున్నరు. అందుకే.. లేటైతదేమో! అయినంక ఫోన్ చేసి చెప్త” అన్నాడు ఆచారి.
“సరే!” అని ముగించాడు గోవిందం.
మరో పదిరోజుల తరువాత ఆచారి నుంచి ఫోన్ వచ్చింది గోవిందానికి. ఇల్లు శుభ్రం చేయించానని చెప్పాడతను. ఆ మరునాడే ఊరికి
బయల్దేరాడు గోవిందం.కల్వకుర్తి నుంచి నాగర్కర్నూలు వెళ్లేదారిలో.. తాడూరు కంటే ముందే రోడ్డునుంచి ఐదు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది గోవిందం స్వగ్రామం.
కల్వకుర్తికి జేరుకునేసరికి మధ్యాహ్నమైంది. అక్కడ లంచ్ చేసి మరో బస్సు, ఆ తరువాత షేర్ ఆటో ఎక్కి ఊరికి చేరుకున్నాడు. నేరుగా ఆచారి ఇంటికి వెళ్లి, అతణ్ని తీసుకొని తమ ఇంటికి వెళ్లాడు.
ఐదు వందల గజాల స్థలంలో కట్టిన చిన్న సింగిల్ బెడ్రూం, హాలూ, కిచెనూ ఉన్న ఇల్లది. ముందు ఖాళీ జాగానే ఎక్కువుంది. గోవిందం వాళ్ల నాన్న పక్క ఊర్లోని హైస్కూల్లో అటెండరుగా పనిచేస్తూ.. రిటైర్మెంట్ డబ్బులతో కట్టుకున్నాడు దాన్ని.
“అరే గోవిందూ! బావున్నావురా!? ఇల్లు అమ్ముతున్నవంట గద. నిన్ననే ఆచారి జెప్పిండు” అన్నాడు పక్కింట్లో ఉన్నతను.. గోవిందాన్ని చూస్తూనే!
“అవును మామా! అమ్ముతున్న” బదులిచ్చాడు గోవిందం.
“కొననీకె శానమందున్నరు. తొందరపడి తక్కువ ధరకు అమ్మొద్దు. బాగా సోంచాయించుకొని రేటు జెప్పు”.
“సరే మామా!”.
“అవున్రా గోవిందూ! నేనీ సంగతి ఒకరిద్దరికి చెప్పిన్నో లేదో.. ఐదారుమంది నా ఎనుక పడ్డరు. రేటెంతనో జెప్పమని” అన్నాడు ఆచారి.
తన ఇంటికి డిమాండు బాగానే ఉందని తెలిసి.. సంతోషంతో ఏం మాట్లాడ లేకపోయాడు గోవిందం.
“ఎవరైనా అడిగితే.. ఆరేడు పైన్నే జెప్పు” తిరిగి
తనే అన్నాడు ఆచారి.
“అంతనా?” ఆశ్చర్యపోయాడు గోవిందం.
“అవును మల్ల! ఏమనుకుంటున్నవు. నడూళ్ల ఇంత పెద్ద జాగా అంటే మాటలా!? తెలంగాణొచ్చినంక నీళ్ల కరువు పోయి, భూముల రేట్లు చాన పెరిగినయి. మనూళ్లె ఎకరం ఎంతనుకుంటున్నవు? ముప్పయి, నలభై లక్షల పైన్నే నడుస్తున్నది”.
“అమ్మో! అంతరేటా?” ఆశ్చర్యంతో అరిచినంత పనిచేశాడు గోవిందం. తనకు తెలిసినంతలో అప్పుడు ఎకరం ధర.. పదిహేనూ ఇరవై వేల వరకు ఉండేది. ఇంతలోనే ఎంత మార్పు?!
ఆ రాత్రి ఓ క్వార్టర్ బాటిల్ విస్కీ తెప్పించుకుని.. స్నేహితులిద్దరూ తాగుతూ ఊరి విశేషాలూ, కుటుంబ విషయాలూ మాట్లాడుకోసాగారు. ఇంతలో గోవిందం ఫోన్ మోగింది. అతని డిగ్రీ క్లాస్మేట్ కాల్ చేస్తున్నాడు.
“గోవిందూ! మన డిగ్రీ క్లాస్మేట్స్ అందరం కలిసి.. వచ్చే ఆదివారం ఆలమ్నీ కండక్ట్ చేస్తున్నాం. మనవాళ్లంతా వస్తున్నారు. పెద్దఎత్తున చేస్తున్నాం. ఒక్కొక్కరి దగ్గర్నుంచి ఐదు వేలు కలెక్ట్ చేస్తున్నాం. నీవు తప్పకరావాలి. అలాగే డబ్బు కూడా పంపాలి”.
“సరేసరే!” అని ఫోన్ పెట్టేశాడు గోవిందం.
“ఏందట?” అడిగాడు ఆచారి.
“ఆలమ్నీ.. అంటే పూర్వవిద్యార్థుల సమ్మేళనం. మా డిగ్రీ క్లాస్మేట్స్ అందరమూ అప్పుడప్పుడిలా కలుసుకుంటూ ఉంటాం” .. అని కాసేపు ఆగి..
“అవునూ! మనం దాదాపు ముప్ఫై మందిమి మనూరి బడిలో ఫస్ట్క్లాసు నుంచి ఫిఫ్త్ వరకూ కలిసి చదువుకున్నాం. వాళ్లంతా ఎక్కడెక్కడ ఉన్నారో నీకేమైనా తెలుసా!?”.
“చానామంది తెల్సు. ఇరవైమంది దాకా ఈ ఊళ్లనే ఉన్నరు. నీలాగ ఐదారు మంది హైదరాబాదులున్నరు. ఇంక నలుగురైదుగురు చచ్చిపోయిండ్రు!”.
“ఆ గోపాల్ రెడ్డీ, యాదయ్యా, పర్వతాలూ.. ఇప్పుడున్నరా” ఆసక్తిగా అడిగాడు గోవిందం.
“ఉన్నరు. రేపు కలుద్దమా?”.
“కలవడం అంటే ఒకరిద్దరితో కాదు. మొత్తం మన బ్యాచ్ పూర్వ విద్యార్థులం అందరం.. ఈ ఇంట్లోనే కలుసుకుందం. వీలయితదా”.
“ఉత్తగ రమ్మంటె ఎంత మందొస్తరో కానీ, దావతిస్తున్నమంటే అందరొస్తరు” నవ్వుతూ అన్నాడు ఆచారి.
“అరేంజ్మెంట్స్ నీవు చేస్తానంటే.. దావతియ్యడానికి నేను రెడీనే!”.. తనూ నవ్వుతూ అన్నాడు గోవిందం.
“నిజంగనే అంటున్నవా!?”.
“నిజమే ఆచారీ! రేపుదయమే పోయి వీలైనంత మందిని కలిసి చెప్పుదం. అట్లనే ఇల్లు సంగతి కూడ చెప్పొచ్చు”.
“దావతంటే చికెనో, మటనో పెట్టాలి. మనం
చికెన్ పెడ్దాం!”.
“చికెన్తోపాటు గుడ్లు, అరటిపండ్లు కూడా తెప్పించు. స్వీటుకూడా! ఖర్చుకు వెనుకాడకు. మనం ఇష్టంగా పెట్టాలె. వాళ్లు తృప్తిగ తినాలె!”.
మరునాడు ఉదయం తొమ్మిది గంటల సమయంలో యాదయ్య ఇంటికి వెళ్లారిద్దరు.
పెరిగిన గడ్డంతో, మాసిన బట్టలతో, శుష్కించిన దేహంతో.. తన వయసుకన్నా పదేళ్ల పెద్దవానిలా ఉన్నాడు యాదయ్య. తను చిన్నప్పుడు చూసిన యాదయ్యలోని ఒక్క చిన్న పోలిక కూడా.. ఇప్పుడు ఏ కోశానా కనిపించక ఆశ్చర్యచకితుడయ్యాడు గోవిందం.
“అరే యాదీ! నేను స్కూలు అటెండరు చిన్నయ్య కొడుకును గోవిందునురా! మనం ఈ ఊళ్లనే ఐదో తరగతి దాకా కలిసి సదువుకున్నంరా! గుర్తుపట్టినవా!?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు గోవిందం.
“అరే గోవిందూ నువ్వా!? ఏం బాగరా.. గిట్లున్న! నేనింకా నీకు గ్యాపకం ఉన్నందుకు మంచిగనిపిస్తున్నదిరా! సదువుకున్నందుకు నీవంత బాగున్నవు. సదువుకోనందుకు నా కిస్మత్ గిట్లుంది” గొంతులోని అంతులేని విషాదం సృష్టంగా తెలుస్తూనే ఉంది.
“అన్ని విషయాలూ మా ఇంటికాడ మధ్యాహ్నం మాట్లాడుకుందాం.. మన క్లాస్మేట్లందరికీ దావతిస్తున్న. తప్పకరా!”.
“నన్నీ ఊళ్ల దావతుకు పిల్చెటోడే లేడు. నీవంత మంచిగ ఇంటికొచ్చి పిల్చుతుండవు. రాకుండుంటనా.. తప్పకొస్తా!” అన్నాడు.
అక్కడినుంచి గోపాల్రెడ్డి ఇంటికి వెళ్లారు గోవిందం, ఆచారి. గోపాల్రెడ్డి ఇల్లును చూసేసరికి ఆశ్చర్యంతోపాటు విచారం కూడా కలిగింది గోవిందానికి. అప్పట్లో ఆ ఊరికే గర్వకారణంగా ఉండేదా ఇల్లు. ఇంటినిండా మందితో ఎప్పుడూ కళకళలాడుతూ.. గొప్పగా ఉండేది. ఇప్పుడేమో శిథిలావస్థలో దయనీయంగా ఉంది.
గోపాల్రెడ్డి తండ్రి ఆ ఊరికి పోలీస్ పటేల్. పైగా భూస్వామి. ఆయన పేరు చెబితేనే ఊరందరికీ హడల్. అందుకే స్కూలులో పిల్లలతోపాటు టీచర్లు కూడా గోపాల్రెడ్డిని ప్రత్యేకంగా చూసేవారు. ఖరీదైన దుస్తులలో యువరాజులా ఉండేవాడతను. అటువంటి గోపాల్రెడ్డి ఇప్పుడు ఆ శిథిలమైన ఇంటి అరుగుపై ఒక్కడే కూర్చుని.. బీడీ తాగుతూ శూన్యంలోకి చూస్తున్నాడు.
“గోపాలన్నా.. బాగున్నావే! నేను గోవిందును గుర్తున్ననా!?”.
“గుర్తుపట్టిన గోవిందూ! నా బాగు ఏం జెప్తరా.. చెప్పుకొంటే ఇజ్జత్ పోతది. కూసోండి కూసోండి!” అంటూ ఇంకో అరుగును చూయించాడు.
కూర్చున్నారిద్దరూ.
“ఇల్లు అమ్ముతున్నవంట గదరా!”.
“అవునన్నా! పిల్లలిద్దరు బయట దేశంలున్నరు. భార్య చనిపోయినంక ఒంటరిగ ఉండలేక.. ఓల్డేజ్ హోమ్ల జాయినైన. అందుకే ఇల్లు అమ్ముదమని
అనుకుంటున్న!”.
“నిజమేలే! ఎవరుండక పోతే ఇల్లు పడావు పడ్తది. అమ్ముకుంటనే మంచిది. నీలాకనే నా భార్య చనిపోయినంక నా బతుకు గూడ ఆగమాగమైపోయింది. ఎంతైనా పెండ్లం లేని మొగోని బతుకు కుక్క బతుకేరా!? నాక్కూడా నీలాకనే ఏ ఓల్డేజ్ హోమ్లోనో ఉండాలనుంది. కానీ నా కొడుకులు ఏమంటలేరు!.
“ఎక్కడున్నరు వాళ్లు”.
“ముగ్గురు కోడుకులూ హైదరాబాద్లనే ఉన్నరు. అంత బానే ఉన్నరు కానీ, పోటీలు పెట్టుకొని తండ్రిని పట్టించుకోరు” అన్నాడు ఆచారి.
“మరి భోజనం!?”.
“రైస్ కుక్కర్ల అన్నం వండుకుంట. కూర ఎవరైన తెచ్చిస్తరు. మన ఆచారి కూడా అప్పుడప్పుడు తీసుకొస్తడు. ఇప్పుడైతే కాలూ చేయీ ఆడుతంది కాబట్టి ఈ మాత్రం జరుగుతున్నది. రేపు మంచాన పడ్తె ఎట్లనో అనే ఫికరుతోనే సస్తూ బతుకుతున్నరా!”.
గుండె బరువైపోయింది గోవిందానికి. ఏమని ఓదార్చాలో అర్థం కాలేదు. చివరికి తానిస్తున్న దావత్ గురించి చెప్పాడు. వస్తాడో రాడో అనే సందేహంతోనే.. రమ్మని ఆహ్వానించాడు.
“నా చిన్ననాటి స్నేహితులు మీరు. మీతో సెప్పుకోవడానికి సిగ్గేంది కానీ, కడుపు నిండా మంచి భోజనం చేయక చానా రోజులైందిరా!” అని అంటుంటే.. గోపాల్ రెడ్డి కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి.
అది గమనించిన ఆ ఇద్దరికి కూడా కళ్లు చెమర్చాయి.
అట్నుంచి పర్వతాలు ఇంటికి వెళ్లారు.
పర్వతాలు పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కుక్కిమంచంపై కాటికి కాళ్లు చాపుకొని ఉన్నవానిలా పడుకొని ఉన్నాడు. చిక్కి శల్యమై ఎముకల గూడులా ఉన్నాడు. వీళ్లిద్దరూ చెరోపక్క పట్టుకొని లేపితేకానీ, మంచంపైనుంచి లేవలేక పోయాడు.
జీవంలేని కళ్లతో గోవిందం వంక ప్రశ్నార్థకంగా చూశాడు. ఆచారి పరిచయం చేస్తే.. ఆ కళ్లు కాస్త వెలిగాయి. తన చేతులతో గోవిందం చేతులను పట్టుకొని ఊపుతూ.. తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. గోవిందం అతణ్ని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించాడు.
“నాకు వత్తమనే ఉంది. కానీ, చాతకాదు కద!” నూతిలోంచి వస్తున్నట్లు.. బలహీనంగా ఉన్న స్వరంలో అంతులేని నిరాశ కూడా ధ్వనించింది.
“ఆటో పంపిస్తంలే! తప్పక రా” అన్నాడు ఆచారి.
“అట్లయితే తప్పక వొస్త”.. అతని మొహంలో ఇప్పుడు కొంత వెలుగు కనిపించింది వారికి.
మరో అరగంటలో మిగతా అందరికీ చెప్పి ఇల్లు చేరుకున్నారు. ఆటోలో తీసుకురాదగిన వారు ముగ్గురున్నారు. భోజనంతోపాటు ఆటో ఏర్పాటు కూడా చేస్తానని ఆచారి వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం ఒంటి గంట అవుతుండగా.. ఒక్కరొక్కరూ రావడం మొదలుపెట్టారు. ఆటోలో వచ్చేవారు కూడా వచ్చారు. మరో అరగంటలో గోపాల్ రెడ్డితోపాటు అందరూ వచ్చేశారు. ఆ సమయానికే ఆచారి అదే ఆటోలో భోజన పాత్రలు తీసుకొచ్చాడు.
గోవిందం ఇంటి వాకిలంతా కోలాహలంగా తయారైంది. వృద్ధులైన వారందరూ చిన్నపిల్లల్లా మారిపోయి.. అల్లరి అల్లరిగా కబుర్లు చెప్పుకొంటున్నారు. పరిహాసాలాడుకుంటూ పగలబడి నవ్వుతున్నారు. తమ కష్టాలన్నీ మరచిపోయినట్లుగా కేరింతలు కొడుతున్నారు. అందరిలోనూ ఉత్సాహం ఉల్లాసం!!
ఉదయం తను చూసిన దయనీయ స్థితిలోని వారేనా వీరు? అని ఆశ్చర్యపోతూ ఆనందపడ్డాడు గోవిందం. ఆచారి సైగ చేయగానే లేచి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ..
“ఇక లేవండి! భోంచేసిన తరువాత తీరిగ్గా కూసొని మాట్లాడుకుందాం” అన్నాడు.
గోవిందం, ఆచారి ఇద్దరూ అందరి ప్లేట్లలో వడ్డిస్తున్నారు. బగారా అన్నం, తెల్లన్నం, చికెన్ కూర, గుడ్ల పులుసు, పప్పు, ఆలుగడ్డ కూర, చారు, పెరుగు అన్నీ సిద్ధం చేశాడు ఆచారి.
“ఈ పల్లెటూర్లో.. ఇంత తక్కువ టైంలో ఇన్ని ఇటమ్స్తో ఇంత మంచి విందు భోజనం చేయిస్తవనుకోలేదు. నీవు గ్రేట్రా! అట్లనే థాంక్స్ కూడా!”.. ఆచారిని హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు గోవిందం.
“వంటంతా నా భార్య చేసిందిరా. సామానంతా ఈ ఆటో రాజుతో తెప్పించిన. నాదేం లేదు!” నవ్వుతూ అన్నాడతను.
అన్నం తిన్న తరువాత అరటిపండు, మైసూర్పాక్ కూడా పెడుతుండటంతో.. గోపాల్ రెడ్డి ఆగలేక, గోవిందం దగ్గరికెళ్లి..
“గోవిందూ! నిన్నెట్ల మెచ్చుకోవాల్నో సమజైతలేదు కానీ, అన్నీ చాలా బాగున్నయి. చాలా దినాల తరువాత మంచి భోజనం తిన్న!” అన్నడు.
అవునన్నట్లుగా అందరూ తలలూపి ఒప్పుకొన్నారు.
భోజనాల తర్వాత అందరూ కబుర్లలో పడిపోయారు. మరో గంట తరువాత అందరికీ కూల్డ్రింక్స్ తెప్పించి.. గ్లాసుల్లో పోసి ఇచ్చారు.
“గోవిందూ.. నీకు చేతులెత్తి మొక్కాలిరా! ఇంతకు ముందెన్నడూ మేమంత ఇట్ల కలుసుకున్నది లేదు. ఇంత సంతోషంగా గడిపింది లేదు. మమ్ముల్ని మా పిల్లలు కడుపు నిండ తిండి పెట్టకుండ.. మాడ్చి సంపుతున్నరు. కుక్క బతుకైందిరా మాది!” అన్నాడొకతను.
“అవున్రా! ఆసరా పించను రెండు వేలొస్తున్నయని మమ్ముల్ని ఇంట్లుంచుకొని.. గింత గంజి పోస్తున్నరు. కానీ ఓ మంచిమాట లేదు. రోగమొస్తే పలకరించే దిక్కులేదు!” అన్నాడు మరొకతను.
“నా ముందల్నే మంచిగ చేసుకొని తింటరు. నాకేమో సద్దికూడు పెడ్తరు. చికెనూ మటనూ తెచ్చుకుంటరు. నాకూ నా భార్యకు గింత సోర్వనన్న పెట్టరు. రాత్రి మిగిలిందే.. పెడ్తరు!”.. దాదాపు ఏడ్చినట్లుగా అన్నాడు పర్వతాలు.
“పొద్దుగాల తింటే రాత్రి దాక ఎదురు సూడాలె! ఒక్కోసారి ఆకలికి కడుపుల నొప్పి!”..
వెక్కి వెక్కి ఏడవసాగాడు మరొకతను.
“ఊర్కో.. ఏడ్వకురా!” అంటూ అతణ్ని ఊరడించడానికి ప్రయత్నిస్తూ.. ఇంకొకరు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అందరికి కూడా దుఃఖం వచ్చి, చిన్నగానో, మౌనంగానో రోదించారు కొద్దిసేపు. గోవిందానికి కూడా గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది.. వాళ్ల దీనగాథలు వింటుంటే. వారితో పోల్చుకుంటే తనంత అదృష్టవంతుడు వీళ్లందరిలో లేడు.
మరో గంటకు అందరికీ టీలు తెప్పించాడు.
టీలు తాగి విచారం నుంచి తేరుకున్నారు.
అనంతరం అందరూ పరస్పరం వీడ్కోలు చెప్పుకొని.. కృతజ్ఞతగా గోవిందాన్ని ఆలింగనం చేసుకొని
ఆనందంగా వెళ్లిపోయారు
ఆ రాత్రి పడుకున్నాడే కానీ నిద్రరావడం లేదు గోవిందానికి. మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. తన బాల్యస్నేహితుల విషాద గాథలే చెవుల్లో గింగురు మంటున్నాయి. ఈ వృద్ధాప్యంలో అందరి కష్టాల కడగండ్లలో సారూప్యం గురించి ఆలోచిస్తుంటే.. అతనికి మూడు సమస్యలు ప్రధానంగా తోచాయి.
మొదటిది ఆకలి. వాళ్లకు సరైన సమయానికి సరైన ఆహారం కడుపునిండా లభించడం లేదు. రెండవది అనారోగ్యం. సరైన వైద్య సహాయమూ, మందులూ లేవు. మూడవది నిరాదరణ లేదా తిరస్కారం. కుటుంబ సభ్యులెవరూ వారిని పట్టించుకోవడం లేదు. పైగా హీనంగా చూస్తున్నారు.
వారు ఒక్కపూటైనా నలుగురితో కలిసి కడుపునిండా భోజనం చేస్తే, ఆరోగ్యం కొంత మెరుగపడవచ్చు. నిరాదరణ వల్ల కలిగిన నైరాశ్యాన్ని అధిగమించవచ్చు.
ఈ ఆలోచనలతో అతను మథనపడగా.. ఓ పరిష్కారం తోచింది. ఉదయమే లేచి ఆచారి ఇంటికి వెళ్లాడు. ఆచారి, అతని భార్యతో.. తన ఆలోచనను పంచుకున్నాడు. తన పరిష్కారంలోని సాదక బాధకాలను చర్చించాడు. వాళ్లిద్దరూ సహకరిస్తే.. తను ఇవ్వబోయే ప్రతిఫలం గురించి చెప్పాడు. అప్పుడు వాళ్లు సంతోషంగా ఒప్పుకొన్నారు.
రాత్రి పిల్లలిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు.
“అల్టిమేట్గా నీవు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది నాన్నా!” అని ఒకేరకంగా చెప్పారు వాళ్లు.
మరుసటి ఉదయమే ఆటో రాజును పిలిచి, ఊళ్లోని తన క్లాస్మేట్స్తోపాటు మిగతా వృద్ధులందరినీ.. ఆడామగా తేడాలేకుండా, మధ్యాహ్న భోజనానికి రమ్మని చెప్పి పంపించాడు గోవిందం. అది దావత్ కాదనీ, రోజూ తినే మామూలు భోజనమేననీ చెప్పమన్నాడు.
ఆ మధ్యాహ్నానికి ముప్ఫైమంది వృద్ధుల దాకా వచ్చారు. అన్నం, ఒక కూర, చారు, పెరుగుకు అదనంగా ఒక గుడ్డును వడ్డించారు. అందరూ ఇష్టంగా తిని సరదాగా కబుర్లు చెప్పుకోసాగారు.
“ఇదే రకమైన సింపుల్ భోజనం ప్రతిరోజూ మనమందరం ఇట్లనే కలిసి తినాలని నా కోరిక. మరి మీరు వొస్తరా?” అని అడిగాడు గోవిందం.
“ఇల్లమ్ముకొని పోదమని వొచ్చినోనివి. ఈడెట్లుంటవు గోవిందూ!?” ఆశ్చర్యంగా అడిగాడు గోపాల్రెడ్డి.
“అట్లనుకొనే వొచ్చిన! కానీ, మొన్న మనం దావత్ చేసుకున్నంక.. నా ఆలోచన మారింది. ఇల్లును ఇప్పుడే అమ్మను. నాకు చాతనైనన్ని రోజులు మీతోనే.. ఇక్కడే కల్సి ఉందమని అనుకుంటున్న. ఓల్డేజ్ హోమ్లో నాకెంతో హాయిగ ఉంటది. కానీ, మీతో ఇట్లుంటే మాత్రం ఆనందంగ ఉంటున్న. ఆ ఓల్డేజ్ హోమ్ల నెలకు నేను కట్టే ఇరవై ఐదు వేలతోనే.. మనం ముప్ఫై మందిమి ఒకపూట మంచిగ తింటున్నం. సంతోషంగ ఉంటున్నం. అంతకన్నా ఏం కావాలి నాకు. అందుకే, మీరేమీ మొహమాట పడకుండా.. ‘మా గోవిందుగాడి ఇంటికి పోతున్నం!’ అని అనుకొని రాండ్రి. ఎందుకంటే నేను ఓల్డేజ్ హోమ్కు ఇచ్చే పైసల్నే మనందరి కోసం ఖర్చుపెడుతున్న” అన్నాడు గోవిందం చిరునవ్వుతో నమస్కరిస్తూ.
“నీవెందుకురా మాకు మొక్కుతున్నవు. నీ గొప్ప మనసుకు మేమందరం నీకు మొక్కాలె!” అన్నాడు యాదయ్య.
“అవునవును!” అని ముక్తికంఠంతో గట్టిగా అంటున్న వారి కళ్లలో.. సంతోషకరమైన ఓ చిన్న వెలుగు రేఖ మెరిసింది.
ఎంత చిన్నదైనా.. వెలుగు వెలుగే కదా!
గంగుల నరసింహారెడ్డి గంగుల నరసింహారెడ్డి స్వస్థలం నాగర్కర్నూల్ జిల్లా వెదిరేపల్లి. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. బీఎస్సీ చదివారు. ఎస్బీఐలో ఉద్యోగం చేసి, పదవీ విరమణ పొందారు. 1980 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకూ 3 నవలలు, 80కిపైగా కథలు రాశారు. వీటిలో రెండు నవలలు, 25 కథలకు వివిధ సాహితీ సంస్థలు, పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు దక్కాయి. 1993లో ఆంధ్రప్రభ వార పత్రిక కథల పోటీలో ఈయన రాసిన ‘వాన కురిసింది’ కథ ప్రథమ బహుమతి పొందడంతోపాటు రచయితగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ అనే సంపుటిలోనూ ఈ కథ స్థానం దక్కించుకున్నది. 2019లో నిర్వహించిన నమస్తే తెలంగాణ – ముల్కనూరు గ్రంథాలయం కథల పోటీలో ‘ఒడిబియ్యం’ కథకు బహుమతి అందుకున్నారు. స్వగ్రామంలో కొందరు తన తోటివారి దయనీయ పరిస్థితులను చూసి ప్రస్తుత కథ.. ‘శిథిల సంధ్యలో చిరుదీపం’ రాసినట్లు రచయిత చెబుతున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి
పొందిన కథ.
-గంగుల నరసింహారెడ్డి
90102 84700