Hardik Pandya | భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. వన్డే వరల్డ్ కప్ సందర్భంగా గాయపడ్డ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా.. నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు.. ఐపీఎల్ – 2024 ఆరంభానికి ముందు అతడు.. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్ -2024లో రీఎంట్రీ ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్ – 2023లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ కాలికి గాయమైన హార్ధిక్.. కీలక సిరీస్లకు దూరమైన విషయం తెలిసిందే.
ఎడమ కాలి మడమకు గాయం కావడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న పాండ్యా.. కొద్దిరోజుల పాటు బరోడాలోని కిరణ్ మోరే అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ అన్న కృనాల్ పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్తో కలిసి ట్రైన్ అయ్యాడు. తదనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో జాయిన్ అయి అక్కడ రిషభ్ పంత్ తో కలిసి వార్మప్ మ్యాచ్లు ఆడాడు. జాతీయ జట్టులోకి రావాలన్నా.. ఐపీఎల్ ఆడాలన్నా దేశవాళీలు ఆడటం తప్పనిసరి అని బీసీసీఐ ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. పాండ్యా డీవై పాటిల్ టీ20 కప్లో ఆడుతున్నాడు.
Hardik Pandya returns to cricket with Reliance 1 for DY Patil. pic.twitter.com/QDBnP1Zk63
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024
ఈ టోర్నీలో రిలయన్స్ 1 కు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్ధిక్ పాండ్యా టీమ్లో తిలక్ వర్మ, నెహల్ వధేరా, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, విష్ణు వినోద్లు ఉన్నారు. వీళ్ళంతా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడేవాళ్లే కావడం గమనార్హం. తొలి మ్యాచ్లో రిలయన్స్ 1.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తో తలపడనుంది. బీపీసీఎల్ టీమ్లో అనుకుల్ రాయ్, శ్రేయస్ గోపాల్, రమణ్దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, సందీప్ శర్మ వంటి ఔత్సాహిక క్రికెటర్లు ఉన్నారు. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ కూడా ఆడనున్నట్టు తెలుస్తున్నది.