భారత జట్టు మాజీ టెస్టు కెప్టెన్ అజింక్య రహానే.. రంజీ ట్రోఫీ ఆడటం ఖాయమైంది. ముంబై తరఫున ఈ వెటరన్ బ్యాటర్ రంజీ బరిలో దిగనున్నాడు. అయితే ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతను మాత్రం రహానేకు అందించలేదట. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధికారికంగా ప్రకటించింది. సఫారీ టూర్లో పూర్తిగా విఫలమై తీవ్రంగా విమర్శలపాలైన రహానే.. రంజీల్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు.
కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టుకు పలు వన్డేల్లో కెప్టెన్సీ వహించిన రహానే.. 100 శాతం విజయాలు సాధించాడు. దీంతో టెస్టుల్లో వైస్ కెప్టెన్ అయ్యాడు కూడా. కానీ ఫామ్ లేమి కారణంగా సఫారీ టూర్లో అతన్ని వైస్ కెప్టెన్ స్థానం నుంచి తొలగించారు. కేఎల్ రాహుల్కు ఆ బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే ముంబై తరఫున రంజీల్లో రాణించాలని రహానే అనుకుంటున్నాడు.
అయితే ఈ జట్టుకు సారధిగా యువ ఆటగాడు పృథ్వీ షాను ఎంపిక చేశారు. అతని అండర్లో ఆడేందుకు రహానే ఎటువంటి విముఖతా చూపలేదని ఎంసీఏ తెలిపింది. జట్టులో కీలక ఆటగాడిగా ఉంటూనే.. నాయకత్వంలో షాకు సూచనలివ్వాలని రహానేను తాము కోరినట్లు కోచ్ మజుందార్ సహా సెలెక్షన్ ప్యానెల్ వెల్లడించింది. దీనికి రహానే అంగీకరించినట్లు సమాచారం.